Jio Q1 Results | రిలయన్స్ జియో మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలే సాధించింది. 2021-22తో పోలిస్తే గత నెలతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో లాభాలు 23.82 శాతం పెరిగి రూ.4,335 కోట్లకు చేరుకున్నాయి.
గతేడాది రూ.17,994 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే, ఈ ఏడాది రూ.21,873 కోట్ల రెవెన్యూ పొందింది. ఒక ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం రూ.4,460 కోట్ల లాభాలతోపాటు రూ.21,808 కోట్ల రెవెన్యూ పొందుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారు.
ఇక ట్రాయ్ గణాంకాల ప్రకారం గత మే నెలలో జియో ఖాతాలో కొత్తగా 31 లక్షల మందికి పైగా మొబైల్ సబ్స్క్రైబర్లు జత కలిశారు. దీంతో మొత్తం జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకున్నది.
ఇదిలా ఉంటే, ఈ నెల 26న 5జీ స్పెక్ట్రం వేలం జరుగనున్నది. ఇప్పటికే 5జీ స్పెక్ట్రం కోసం జియో అత్యధికంగా రూ.14 వేల కోట్లు డిపాజిట్ చేయగా, ఎయిర్టెల్ రూ.5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,200 కోట్లు డిపాజిట్ చేశాయి.