Jio Space Fiber Service | దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తొలిసారి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్’ను ప్రారంభించింది. దీంతో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని పేర్కొంది. దీన్ని ‘జియో స్పేస్ ఫైబర్’ సర్వీస్గా పిలుస్తున్నది. శుక్రవారం జరిగిన భారత్ మొబైల్ కాంగ్రెస్’లో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో రిలయన్స్ జియో.. ‘జియో ఫైబర్ సర్వీస్’ను సక్సెస్ఫుల్గా ప్రదర్శించింది.
శాటిలైట్ టెక్నాలజీ కోసం జియో జాయింట్ వెంచర్ సంస్థ ‘జియో ఎస్ఈఎస్’, ‘మీడియం ఎర్త్ ఆర్బిట్’ సంస్థ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని రిలయన్స్ జియో తెలిపింది. ఎస్ఈఎస్ తో ఇంతకుముందే జియో జాయింట్ వెంచర్ ప్రారంభించింది. ఫలితంగా జియోకు ఎస్ఈఎస్ సంస్థ ఆధ్వర్యంలోని ఓ3బీ, ఓ3బీ ఎంపవర్ శాటిలైట్ నెట్వర్క్ యాక్సెస్ అవుతుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్ సంస్థతో భాగస్వామ్యం వల్ల గిగాబైట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలు అందించే ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని జియో తెలిపింది.
ప్రస్తుతం భారత దేశంలో జియోకు ఫిక్స్డ్ లైన్, వైర్లెస్ రూట్లలో 45 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవడానికి జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వంటి సర్వీసులను రిలయన్స్ జియో ఇప్పటికే ప్రారంభించింది. వాటి సరసన జియో స్పేస్ ఎయిర్ ఫైబర్ చేరింది.