ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్వేసింది. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలకు నిర్వహణ ఖర్చులు గండికొట్టాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.12,273 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.13,233 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 58.2 శాతం ఎగబాకి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.91,238 కోట్లుగా ఉన్నది.
కరోనా సెకండ్వేవ్లోనూ రిలయన్స్ రిటైల్ భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. జూన్తో ముగిసిన మూడు నెలల్లో నికర లాభంలో 80 శాతం వృద్ధిని సాధించింది. రూ.1,941 కోట్ల లాభాన్ని గడించినట్లు పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,079 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఏడాది క్రితం రూ.28,197 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికంలో రూ.33,566 కోట్లకు ఎగబాకింది.
టెలికం వెంచర్ జియో లాభాల్లో దూసుకుపోతున్నది. గడిచిన త్రైమాసికంలో జియో రూ.3,651 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,519 కోట్లతో పోలిస్తే 44.9 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.8 శాతం ఎగబాకి రూ.18,952 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.17,254 కోట్లుగా ఉన్నది. గత త్రైమాసికంలో కొత్తగా 2.67 కోట్ల మంది వినియోగదారులు చేరడంతో మొత్తం సంఖ్య 44 కోట్లకు చేరుకున్నారు. ఒక్కొక్కరి నుంచి సరాసరిగా రూ.138.40 ఆదాయం ఆర్జించినట్లు అయింది.