న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చిలో రూ.19,299 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నిరుడు రూ.16,203 కోట్ల లాభంతో పోలిస్తే 19 శాతం అధికం. ఈసారి రూ.2.16 లక్షల కోట్ల ఆదాయాన్ని గడించింది. అంతక్రితం ఏడాది వచ్చిన రూ.2.11 లక్షల కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9 లక్షల కోట్ల ఆదాయంపై రూ.66,702 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
రిలయన్స్ రిటైల్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.9 శాతం పెరిగి రూ.2,415 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 21 శాతం అధికమై రూ.61,559 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 18 వేల రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది.
రిలయన్స్ జియో విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ జనవరి-మార్చిలో రూ.4,716 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,173 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం అధికమని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం రూ.20,945 కోట్ల నుంచి రూ.23,394 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.90,786 కోట్ల ఆదాయంపై రూ.18,207 కోట్ల నికర లాభాన్ని గడించింది.
‘దేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ కనెక్టివిటీ, రిటైల్ రంగాలు దన్నుగా నిలుస్తున్నాయి. భారత్లో కోట్లాదిమందికి డిజిటల్ సాధికారితను అందించడంలో జియో కీలకపాత్ర పోషించింది. కేవలం ఆరు నెలల్లోనే 2,300కిపైగా నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ