ముంబై, ఆగస్టు 28: వచ్చే నెల 19 వినాయక చవితిరోజున జియో ఎయిర్ఫైబర్ సేవల్ని ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం ఇక్కడ జరిగిన 46వ కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమా వేశంలో మాట్లాడుతూ జియో ఖాతాదారుల సంఖ్య 45 కోట్లు దాటిందని, 5జీ నెట్వర్క్లో 5 కోట్ల చందాదారులు చేరారని వివరించారు. జియో నెట్వర్క్లో నెలకు ఒక్కో యూజర్ సగటున 25 జీబీ వినియోగిస్తున్నారన్నారు. కాగా, డిసెంబర్కల్లా 5జీ సేవల్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తామన్న ముకేశ్.. ఓటీటీల్లో జియో సినిమా టాప్లో ఉన్నట్టు చెప్పారు.
ఇప్పటివరకూ ఆప్టిక్ ఫైబర్ ద్వారా ఫిక్స్డ్ వైర్లైన్ టెలికం సేవల్ని అందిస్తున్న జియో.. 5జీ నెట్వర్క్ను ఉపయోగించుకుని, ఎయిర్ఫైబర్తో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ డివైజెస్ ద్వారా ఇండ్లకు, కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవల్ని కనెక్ట్ చేస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆప్టిక్ ఫైబర్ను వేయలేకపోయామని, అటువంటి చోట్ల ఎయిర్ఫైబర్తో ఇంటర్నెట్ను కస్టమర్ల దరికి చేర్చుతామని ఈ సందర్భంగా ముకేశ్ తెలిపారు. ఇక ఇందులో వినియోగదారులు సెకనుకు 1జీబీ ఇంటర్నెట్ స్పీడ్ను అందుకోవచ్చు. కాగా, ఎయిర్టెల్ ఎయిర్ఫైబర్ కంటే తక్కువకే జియో ఎయిర్ఫైబర్ డివైజ్ ధర ఉండొచ్చని అంచనా.
ఆసియాలోనే శ్రీమంతుడైన ముకేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాను మరో ఐదేండ్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొనసాగుతానన్న 66 ఏండ్ల ముకేశ్.. తన సంతానం ఇషా, ఆకాశ్, అనంత్లను కంపెనీ బోర్డులో నియమించారు. కాగా, ముందు సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా పదవుల్లో ఉంటారని, షేర్హోల్డర్ల అనుమతి లభించిన తర్వాత వారు బోర్డులో చేరతారని రిలయన్స్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. మరోవైపు ఇప్పటివరకూ సభ్యురాలైన ముకేశ్ సతీమణి నీతా అంబానీ బోర్డు నుంచి వైదొలిగారు. రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తారు.
రిలయన్స్ రిటైల్ వెంచర్పై పలు అంతర్జాతీయ వ్యూహాత్మక, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని ముకేశ్ తెలిపారు. త్వరలో ఆ వివరాల్ని అప్డేట్ చేస్తానన్నారు. ఇటీవల రిలయన్స్ రిటైల్ వెంచర్లో 1 శాతం వాటా కొనుగోలుకు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చేసిన ఒక బిలియన్ డాలర్ల (రూ.8,278 కోట్లు) పెట్టుబడిని వివరిస్తూ రిటైల్ వ్యాపారానికి 100 బిలియన్ డాలర్ల విలువకడుతూ ఆ ఇన్వెస్ట్మెంట్ అందిందన్నారు. 2020 సెప్టెంబర్లో తమ రిటైల్ వ్యాపారం విలువ రూ.4.28 లక్షల కోట్లు కాగా, ఇప్పుడది రెట్టింపు (రూ.8.72 లక్షల కోట్లు) అయ్యిందని చెప్పారు. ఈ విలువతో రిలయన్స్ రిటైల్ లిస్టయితే భారత్లో నాల్గవ అతిపెద్ద కంపెనీగా, అంతర్జాతీయంగా టాప్-10 రిటైలర్గా అవతరిస్తుందన్నారు.
కొత్తగా మార్కెట్లో లిస్టయిన ఆర్థిక సేవల కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా రంగంలోకి ప్రవేశిస్తుందని ఆర్ఐఎల్ చైర్మన్ ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, డిజిటల్ ఇంటర్ఫేస్ ద్వారా లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ సాధనాల్ని జియో అందిస్తుందని చెప్పారు. ఇది అధిక మూలధనం అవసరమైన వ్యాపారమని, ఇందుకు తగినరీతిలో రూ.1.2 లక్షల కోట్ల నెట్వర్త్ను జియోకు రిలయన్స్ అందించిందన్నారు. ప్రారంభదశలోనే అత్యధిక మూలధన వనరులు కలిగిన ఫైనాన్షియల్ సంస్థ ఇదేనని చెప్పారు. యూఎస్కు చెందిన బ్లాక్రాక్తో జియో ఫిన్ జాయింట్ వెంచర్ వివరాల్ని వెల్లడిస్తూ బ్లాక్రాక్ 11 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల్ని నిర్వహిస్తున్న అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అని చెప్పారు.