‘అన్ని వ్యాపార విభాగాలూ పటిష్టమైన పనితీరును కనపర్చడంతో రిలయన్స్ మరో త్రైమాసికంలో వృద్ధి జోరును కొనసాగించింది. ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులున్నా, ఓ2సీ విభాగం ప్రత్యేకించి ఆయిల్, గ్యాస్ వ్యాపారం వృద్ధి సాధించింది. డిజిటల్ ఇండియా విజన్కు కట్టుబడి రెండు వినూత్న సాధనాలు.. జియోఎయిర్ఫైబర్, జియోభారత్ ఫోన్అను అందిస్తున్నాం. 2023 డిసెంబర్కల్లా దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణను పూర్తిచేస్తాం. రిలయన్స్ రిటైల్ విస్త్రత శ్రేణి ఉత్పత్తులతో తన ఆఫ్లైన్, ఆన్లైన్ ఉనికిని శరవేగంగా విస్తరిస్తుంది’
-ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్ఐఎల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కన్సాలిడేటెడ్ నికరలాభం 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో 27 శాతం వృద్ధిచెంది రూ. 17,394 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.25.71) చేరింది. గత ఏడాది ఇదేకాలంలో రూ.13,656 కోట్ల నికరలాభాన్ని (షేరుకు రూ.19.92)ఆర్జించింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కనపర్చిన రూ.16,011 కోట్లకంటే తాజాగా ముగిసిన మూడు నెలల్లో అధిక లాభాన్ని సంపాదించింది. అయితే కంపెనీ ఆదాయం దాదాపు ఫ్లాట్గా రూ.2.55 లక్షల కోట్లుగా నమోదయ్యింది. శుక్రవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు ఆర్థిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇంధనాలకు, పెట్రోకెమికల్స్కు డిమాండ్ పటిష్టంగా ఉండటం, విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించడంతో తమ ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) వ్యాపారం మెరుగుపడిందని ఆర్ఐఎల్ వివరించింది. నిర్వహణాపరంగా చూస్తే కంపెనీ ఇబిటా 30 శాతం అధికమై రూ.44,867 కోట్లకు చేరింది. ఓ2సీ ఇబిటా భారీగా 36 శాతం పెరిగి రూ.16,281 కోట్లకు పెరిగింది.
జూన్ త్రైమాసికంలో రూ.3.18 లక్షల కోట్లుగా ఉన్న ఆర్ఐఎల్ రుణం సెప్టెంబర్ చివరినాటికి రూ.2.95 కోట్లకు తగ్గింది. అధిక వడ్డీ రేట్ల కారణంగా వడ్డీ వ్యయాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 26 శాతం పెరిగి రూ. 5,731 కోట్లకు చేరాయి. తరుగుదల కేటాయింపులు 30 శాతం వృద్ధితో రూ.12,585 కోట్లకు పెరిగాయి.
ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ నికరలాభం 21 శాతం వృద్ధిచెంది రూ.2,790 కోట్లకు చేరగా, ఆదాయం 19.48 శాతం పెరిగి రూ.68,937 కోట్ల వద్ద నిలిచింది. కొత్త స్టోర్లు ప్రారంభించడం, సందర్శకులు పెరగడం, అన్ని ఉత్పత్తులకూ వినియోగం వృద్ధిచెందడంతో మంచి ఫలితాల్ని సాధించామని రిలయన్స్ తెలిపింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో 471 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,650కి చేరింది. సందర్శకుల సంఖ్య 40 శాతం వృద్ధితో 26 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.
టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికరలాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 12 శాతం పెరిగి రూ. 5,058 కోట్లకు చేరింది. ఆదాయం 9.8 శాతం పెరిగి రూ. 24,750 కోట్లకు పెరిగింది. తమ ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ఏపీఆర్యూ) 2.5 శాతం పెరిగి రూ.181.7కి చేరినట్టు రిలయన్స్ జియో మాతృసంస్థ జియో ప్లాట్ఫామ్స్ తెలిపింది. చందాదారుల సంఖ్య 7.5 శాతం వృద్ధిచెంది 45.97 కోట్లకు చేరిందన్నది. తాము జూలైలో విడుదల చేసిన జియోభారత్ ఫోన్ కొద్ది నెలల్లోనే మంచి మార్కెట్ వాటాను సాధించిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 8,000 నగరాలు, పట్టణాల వ్యాప్తంగా 10 లక్షల 5జీ సెల్స్ను అమర్చినట్టు తెలిపింది. లక్షలాది గృహాలకు జియో ఎయిర్ఫైబర్ ద్వారా హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించామన్నది.