న్యూఢిల్లీ, జనవరి 21: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నికరలాభం 2021 డిసెంబర్ త్రైమాసికంలో భారీగా పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.14,894 కోట్లుగా ఉన్న లాభం తాజాగా 37.90 శాతం వృద్ధిచెంది రూ.20,539 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 54.25 శాతం వృద్ధితో రూ.1,23,997 కోట్ల నుంచి రూ. 1,91,271 కోట్లకు పెరిగింది. అయితే నికరలాభం మార్జిన్ 10.8 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గింది. అలాగే తాజా ఫలితాల్లో అమెరికాలోని షేల్ గ్యాస్ ఆస్తుల అమ్మకం ద్వారా ఒనగూడిన రూ.2,872 కోట్ల్లు లాభం భారీగా పుంజుకోవడానికి కలిసివచ్చింది. కంపెనీ ఆయిల్, కెమికల్స్ వ్యాపారం ఈబీటా 38.7 శాతం పెరిగి రూ. 13,530 కోట్లకు చేరింది. ఈ విభాగం ఈబీటాలో మూడువంతులు ఓ2సీ, ఆయిల్, గ్యాస్ వ్యాపారం ద్వారా వచ్చిందని, ఈ ఉత్పత్తుల ధరలు, డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని ఆర్ఐఎల్ శుక్రవారం తెలిపింది. తమ స్థూల రుణం రూ. 2,44,708 కోట్లు కాగా, రూ.2,41,846 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
జియో లాభం రూ.3,795 కోట్లు
రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ రూ.24,176 కోట్ల ఆదాయంపై రూ. 3,795 కోట్ల కన్సాలిడేటెడ్ లాభా న్ని ఆర్జించినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ విభాగం ఈబీటా 18 శాతం వృద్ధితో రూ.10,008 కోట్లకు పెరిగింది. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 1.02 కోట్ల మంది చేరడంతో మొత్తం జియో చందాదారుల సంఖ్య 42.1 కోట్లకు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. యూజర్ సగటు రెవిన్యూ రూ. 151.6గా ఉందని, డాటా ట్రాఫిక్ 48 శాతం వృద్ధితో 23.4 బిలియన్ జీబీలకు చేరుకున్నట్టు కంపెనీ వివరించింది. దేశంలోని 1,000 ప్రధాన నగరాల్లో 5జీ కవరేజ్ ప్లానింగ్ను పూర్తిచేశామని, తమ 5జీ నెట్వర్క్పై హెల్త్కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పరిశ్రమల్లో ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది.
రిటైల్ ఆదాయం రూ. 57,714 కోట్లు
రిలయన్స్ రిటైల్ స్థూల ఆదాయం సమీక్షా కాలంలో 52.5 శాతం వృద్ధితో రూ. 57,714 కోట్లకు చేరింది. నికరలాభం 23.4 శాతం పెరుగుదలతో రూ. 2,259 కోట్ల వద్ద నిలిచింది. మొత్తం 14,412 స్టోర్లు ప్రస్తుతం నడుస్తున్నాయని, ముగిసిన త్రైమాసికంలో 837 స్టోర్స్ను ఆరంభించినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ స్టోర్స్ నిర్వహణా విస్తీర్ణం 40 మిలియన్ల చదరపు అడుగులకు పెరిగాయన్నది.
మా వ్యాపారాలన్నీ జోరు చూపించడంతో ఈ క్వార్టర్లో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించాం. మా రిటైల్, డిజిటల్ సర్వీసుల వ్యాపారాలు రికార్డుస్థాయిలో టర్నోవర్ను, ఈబీటాను ఆర్జించాయి. లాక్డౌన్లు లేకపోవడంతో పాటు పండుగ సీజన్ నేపథ్యంలో అన్ని వినియోగ విభాగాల్లోనూ పటిష్ఠ వృద్ధిని సాధించాం. మా డిజిటల్ సర్వీసుల వ్యాపారం విస్త్రతమయ్యింది. లాభదాయక వృద్ధిని కనపర్చింది. -ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ