న్యూఢిల్లీ, మే 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒకే ఏడాదిలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన తొలి భారతీయ కంపెనీగా ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు (102 బిలియన్ డాలర్లు) చేరినట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. పూర్తి ఏడాదికి రూ. 60,705 కోట్లనికరలాభాన్ని సంపాదించింది. ఇక మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో అధిక రిఫైనింగ్ మార్జిన్లు, టెలికం, డిజిటల్ సర్వీసుల్లో స్థిర వృద్ధి, రిటైల్ వ్యాపారం జోరు కారణంగా నికరలాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 22.5 శాతం వృద్ధితో రూ.16,203 కోట్లకు పెరిగింది. అయితే ఇది విశ్లేషకుల అంచనాకంటే తక్కువ. నిరుడు ఇదేకాలంలో లాభం రూ. 13,227 కోట్లుగా ఉంది. వివరాలు..
వరుసగా ఆరు త్రైమాసికాలుగా కంపెనీ నికరలాభం వృద్ధిచెందుతుండగా, ఈ మార్చి క్వార్టర్లో మాత్రం డిసెంబర్కంటే 12.6 శాతం తగ్గింది.
ముగిసిన మూడు నెలల్లో కన్సాలిడేటెడ్ ఆదాయం 35 శాతం వృద్ధిచెంది రూ.2.32 లక్షల కోట్లకు పెరిగింది.
ఇబిటా మాత్రం 28 శాతం వృద్ధిచెంది రూ.33,968 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో ఇబిటా ఆర్జించడం ఇదే ప్రధమం.
ఓ2సీ ఇబిటా రూ.14,241 కోట్లకు, డిజిటల్ సర్వీసుల ఇబిటా రూ. 11,209 కోట్లకు, రిటైల్ ఇబిటా రూ.3,712 కోట్లకు పెరిగింది.
టెలికం స్పెక్ట్రం చెల్లింపుల కారణంగా రుణాలు రూ.2,66,305 కోట్లకు చేరినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. ఇవి కంపెనీ వద్దనున్న నగదు నిల్వ రూ. 2,31,490 లక్షల కోట్లకంటే అధికం.
జియో లాభంలో 24 శాతం వృద్ధి
గత రెండు త్రైమాసికాలుగా చందాదారుల సంఖ్య తగ్గినప్పటికీ, మెరుగైన ఏపీఆర్యూ (ఒక్కో వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం) మెరుగ్గా ఉండటంతో రిలయన్స్ జియో నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం వృద్ధితో రూ. 4,173 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జియో నికరలాభం రూ. 14,854 కోట్లకు చేరింది. నెలవారీ ఏపీఆర్యూ 21 శాతం వృద్ధితో రూ.167.6కు పెరిగింది. కస్టమర్ల సంఖ్య మాత్రం 42.1 కోట్ల నుంచి 41 కోట్లకు తగ్గింది.
తగ్గిన రిటైల్ లాభం
రిలయన్స్ రిటైల్ వ్యాపారం నికరలాభం మార్చితో ముగిసిన మూడు నెలల్లో 4.8 శాతం క్షీణించి రూ. 2,139 కోట్లకు దిగింది. ముగిసిన త్రైమాసికంలో 793 స్టోర్స్ను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 15,196కు పెరిగింది. వివిధ బ్రాండ్ల కొనుగోలుకు, స్టోర్స్ ఏర్పాటుకు 1 బిలియన్ డాలర్లు ఖర్చుచేసారు.
2.1 లక్షల కొత్త ఉద్యోగుల్ని నియమించాం
‘కొవిడ్ వేవ్స్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఎదురైన సవాళ్ల మధ్య రిలయన్స్ మంచి పనితీరును ప్రదర్శించింది. మా డిజిటల్ సర్వీసులు, రిటైల్ విభాగాల్లో పటిష్ట వృద్ధిని సాధించాం. ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నా, ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) వ్యాపారం బాగా కోలుకున్నది. ముగిసిన ఏడాది మా వ్యాపారాల్లో కొత్తగా 2.1 లక్షల మంది ఉద్యోగుల్ని చేర్చుకున్నాం. ఇందులో చాలావరకూ నియామకాలు మా వినియోగ, టెక్నాలజీ విభాగాల్లో జరిగాయి. రిటైల్ వ్యాపారంలో స్టోర్స్ సంఖ్య 15,000కు చేరింది. జియో ఫైబర్ ప్రారంభించిన రెండేండ్లకే దేశంలో అతిపెద్ద బ్రాడ్బ్యాండ్గా ఎదిగింది. కొత్త ఇంధనాలు, కొత్త మెటీరియల్స్ వ్యాపారంలో కంపెనీ మంచి ప్రగతిని సాధిస్తున్నది. జామ్నగర్లో 5,000 ఎకరాల్లో న్యూ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీల కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాం. 2035 సంవత్సరానికల్లా నెట్ కార్బన్ జీరో లక్ష్యాన్ని సాధిస్తాం’
– ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్ఐఎల్