Reliance AGM | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈ నెల 28న జరుగనున్నది. 2016లో 4జీతో టెలికం రంగంలోకి జియో టెలికం నెట్వర్క్ ప్రారంభంతో రిలయన్స్ ఏజీఎంల పట్ల నెటిజన్లు, వాటాదారుల్లో ఆసక్తి ప్రారంభమైంది. నాటి నుంచి సామాన్య పౌరులకు కనెక్టయేలా ప్రతి ఏజీఎంలోనూ రిలయన్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేస్తోంది. సోమవారం జరిగే ఏజీఎంలో ఎటువంటి ప్రకటనలు ఉంటాయన్న విషయమై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. రిటైల్ రంగంతోపాటు ఎనర్జీ వంటి కీలక సెక్టార్లపై రిలయన్స్ ఏజీఎం ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
2016లో దేశీయ టెలికం రంగంలోకి జియో ఎంటరైన తర్వాత పలు సంచలనాలకు వేదికగా మారింది. దేశంలోనే అతిపెద్ద టెలికం నెట్ వర్క్ గల సంస్థగా ‘జియో’ నిలిచింది. ప్రస్తుతం రిలయన్స్ జియోకు 44.85 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పుడు జియో వెల్ కం ఆఫర్ కింద అపరిమిత ఉచిత డేటాను అందిస్తోంది. ఈ ఏజీఎంలోనూ 5జీ ప్లాన్లు ప్రకటిస్తారని సమాచారం.
ఇంతకుముందు 2జీ ముక్త్ భారత్ నినాదంతో పలు ఫోన్లను ఆవిష్కరించిన జియో.. సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరకే జియోస్మార్ట్ ఫోన్ ధరలు, ప్లాన్ల టారిఫ్లు ఉంటాయి. గతేడాది ఏజీఎంలో గూగుల్ భాగస్వామ్యంతో 5జీ స్మార్ట్ ఫోన్ తెస్తామని ప్రకటించిన రిలయన్స్.. ఈసారి రెండు ఫోన్లు తెస్తుందని ప్రచారం ఉంది. వీటి ధరలు ఎలా ఉంటాయి.. ఏయే ఫీచర్లు ఉంటాయి.. వీటికి స్పెషల్ ప్లాన్లు అమలు చేస్తారా.. ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
టెలికంతోపాటు ఫైబర్ సేవలూ జియో అందిస్తున్నది. ఇక ముందు ఫైబర్ కేబుల్స్ అవసరమే లేకుండా ఎయిర్ ఫైబర్ పేరిట ఓ 5జీ పరికరం అందుబాటులోకి తేబోతున్నది. ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా ‘ఎయిర్ ఫైబర్’ డివైజ్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ సారి జరిగే ఏజీఎంలో ‘జియో ఎయిర్ ఫైబర్’పై ప్రకటన చేయొచ్చునని భావిస్తున్నారు. ఈ డివైజ్ మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత కొన్ని రోజుల వరకూ కొనుగోలుపై డిస్కౌంట్ లేదా ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఇస్తారని తెలుస్తోంది.