Reliance AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services)’ బీమా రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఈ సంగతి రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సోమవారం జరిగిన సంస్థ 46వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రకటించారు.
సాధారణ, జీవిత, ఆరోగ్య బీమా రంగ ఉత్పత్తుల్లోకి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్సీ) ఎంటరవుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇందుకోసం గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుందన్నారు.
‘ప్రారంభంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేయాడానికి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్)లో రిలయన్స్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది పూర్తిగా అత్యధిక పెట్టుబడుల ఇన్సెంటివ్ బిజినెస్.’ అని ముకేశ్ అంబానీ తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ- అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బ్లాక్ రాక్తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. 11 లక్షల కోట్ల డాలర్ల పై చిలుకు ఆస్తులతో పేరు ప్రఖ్యాతుల గల సంస్థ బ్లాక్ రాక్ అని తెలిపారు. బ్లాక్ రాక్, జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టర్లకు చౌక, ఇన్నోవేటివ్ ఇన్వెస్ట్ మెంట్ సొల్యూషన్స్ అందిస్తుందన్నారు. బ్లాక్ రాక్ సీఈఓ ల్యారీ ఫింక్ కూడా సమావేశంలో మాట్లాడారు.