న్యూఢిల్లీ, జనవరి 29: దేశీయ ఇంధన విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) అంచనాలకుమించి రాణించింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికరావడం, ఇంధన విక్రయాలు భారీగా పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.3,181.42 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,747.01 కోట్లతో పోలిస్తే 82 శాతం అధికమని పేర్కొంది. అయినప్పటికీ, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.8,243.55 కోట్ల కంటే ఇది తక్కువ కావడం విశేషం. గత త్రైమాసికంలో సంస్థకు బ్యారెల్ క్రూడాయిల్ను శుద్ది చేయడంతో 13.3 డాలర్ల ఆదాయం సమకూరింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1.3 లక్షల కోట్లుగా నమోదైంది.