రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, గరిష్ఠ చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును రిజర్వ్బ్యాంక్ భారీగా కోతపెట్టింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి కుదించింది. ఫిబ్రవరిలో జరిగిన పాలసీ మీట్ సందర్భంగా 7.8 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. 2021-22లో ఇది 8.9 శాతంగా ఉంది. రెండేండ్ల తర్వాత కొవిడ్ సంక్షోభం నుంచి మనం బయటపడ్డామని, అయితే ఫిబ్రవరి 24 నుంచి యూరప్లో యుద్ధం, తదుపరి ఆంక్షలు, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పరిస్థితి మారిపోయిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. అయితే ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత పెనుతుఫాను నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడానికి రిజర్వ్బ్యాంక్ సంసిద్ధంగా ఉందన్నారు. గత రెండు నెలలుగా నెలకొన్న అంతర్జాతీయ పరిణామాలతో దేశీ వృద్ధి తగ్గే రిస్క్, ద్రవ్యోల్బణం పెరిగే రిస్క్ ఏర్పడిందన్నారు. దీంతో 2022-23లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా అంచనా వేస్తున్నామని తెలిపారు.