న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాక మందగించింది. గత నెలలో భారీగా తగ్గిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ్చిన ఎఫ్పీఐలు.. ఆగస్టులో మాత్రం 4 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్ నుంచి గమనిస్తే ఆగస్టులోనే అతి తక్కువగా నమోదయ్యాయి. మే నెలలో రూ.43,838 కోట్లు, జూన్లో రూ.47,148 కోట్లు, జూలైలో రూ.46,618 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు భారతీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఆగస్టులో మాత్రం రూ.12,262 కోట్లకే పరిమితమయ్యాయి. ఏప్రిల్లో రూ.11,631 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు రాగా.. మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లోకి గత నెల పెట్టుబడులు దిగజారినైట్టెంది. ఈ ఏడాది మార్చిలోనైతే దేశీయ మార్కెట్లలోకి రూ.7,935 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం.
వెంటాడిన భయాలు
విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులను వివిధ రకాల భయాలు వెంటాడినట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంచనాలు, అక్కడి బాండ్ ఈల్డ్స్ మరింతగా ఉంటాయన్న ఆశలు, డాలర్తో పోల్చితే రూపాయి పతనం వంటివి ప్రధానంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. లాభాల స్వీకరణ కూడా మార్కెట్ను దెబ్బతీస్తున్నదని పేర్కొంటున్నారు.
మున్ముందూ ఇంతే..
దేశీయ మార్కెట్లలోకి ఇకపై విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు క్రమేణా తగ్గిపోవచ్చన్న అభిప్రాయాలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ‘అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న వివిధ పరిణామాల దృష్ట్యా రాబోయే నెలల్లో కూడా భారతీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తగ్గుతాయనిపిస్తున్నది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన రిటైల్ రిసెర్చ్ విభాగం అధిపతి సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. ముడి చమురు ధరల్లో అనిశ్చితి సైతం భారత మార్కెట్లకు ప్రతికూలంగా మారిందన్నారు.
‘డాలర్తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ.. దేశీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారుతున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఈ నెల కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పెట్టుబడి అవకాశాలు ఇంకా సన్నగిల్లుతున్నాయి’
-విక్రమ్ కసత్, ప్రభుదాస్ లీలాధర్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వైజరీ హెడ్
‘కరెన్సీ మార్కెట్లో బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ.. భారత్లోకి వచ్చే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను అడ్డుకుంటున్నది. చైనాకు ఆ పెట్టుబడులు వెళ్లేందుకు దారితీస్తున్నది. దేశంలో అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కూడా విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులను భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప ఇప్పట్లో దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను ఊహించలేమనిపిస్తున్నది’
-నిశిత్ మాస్టర్, యాక్సిస్ సెక్యూరిటీస్ పీఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజర్