Edible Oil | న్యూఢిల్లీ, మార్చి 13: వంటనూనెల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నెలలో భారత్ 9.75 లక్షల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే 13 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత నెలలో 9,74,850 టన్నుల వంటనూనెలు, వంటనూనేతర ఆయిల్స్ దిగుమతి అయ్యాయని, క్రితం ఏడాది ఇదే నెలల అయిన 11,14,481 టన్నులతో పోలిస్తే భారీగా తగ్గిందని పేర్కొంది. వీటిలో 9,67,852 టన్నుల వంటనూనె కాగా, 7 వేల టన్నులు వంటనూనేతర ఆయిల్స్ ఉన్నదని పేర్కొంది.
మరోవైపు నవంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 మధ్యకాలంలో మొత్తం వంటనూనె దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గి 46,47,963 టన్నులకు తగ్గినట్లు వెల్లడించింది. నవంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలాన్ని చమురు మార్కెటింగ్ ఏడాదిగా గుర్తిస్తారు. దేశీయంగా వినియోగిస్తున్న వంటనూనెలో సగం దిగుమతులపైన ఆధారపడుతున్నది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్న భారత్..సోయాబిన్ ఆయిల్ను అర్జేంటినా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది.