హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగంపై విధిస్తున్న జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయి) తెలంగాణ ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి జీఎస్టీ రేట్లు, అధికారుల ఒత్తిళ్లు తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం నిర్మాణ రంగంపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా..దీనిని 3 శాతానికి, ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ను 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలని వారు కోరారు.
అలాగే జీఎస్టీలో స్పష్టత లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, ఈ రేట్లలో అనేక సందేహాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిస్తే వసూళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. భూములను డెవలప్మెంట్కు తీసుకున్నప్పుడు భూ యజమానుల జీఎస్టీ వాటాకు వారే బాధ్యత వహిస్తారని, వారు జీఎస్టీ కట్టడం లేదన్న కారణంతో అధికారులు డెవలపర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వివరించారు. అన్నిరకాల జీఎస్టీలు చెల్లించి వ్యాపారాలు చేస్తున్న డెవలపర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో క్రెడాయి చైర్మన్ చెరుకు రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డీ మురళీకృష్ణారెడ్డి తదితరులున్నారు.