HomeBusinessRecorded A Growth Of 10 5 Percent And Created Large Scale Employment Opportunities
తెలంగాణలో పరుగందుకున్న పారిశ్రామికం
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది.
ఇండస్ట్రియల్ సెక్టార్లో 10.5 శాతం వృద్ధి
రాష్ట్ర స్థూల విలువ జోడింపు 18.96 శాతంగా నమోదు
పరిశ్రమల అనుమతుల్లో మేడ్చల్
పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం
సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది. 10.5 శాతం వృద్ధిని నమోదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను సృష్టించింది. అలాగే, ఈ ఏడాది రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్వీఏ) 18.96 శాతంగా నమోదైంది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక నివేదిక 2022-23 (సోషియో ఎకనమిక్ ఔట్లుక్)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పారిశ్రామిక రంగానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ సులభతర అనుమతుల కోసం టీఎస్ ఐపాస్ పేరుతో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, పెట్టుబడిదారులు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి టీ ఐడియా, టీ ప్రైడ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడంతోపాటు పావలా వడ్డీ రుణాలు, రాయితీపై విద్యుత్ సరఫరా కూడా సమకూర్చుతున్నది. ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో అనేక విదేశీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. థాయ్లాండ్తో అవగాహనా ఒప్పందం చేసుకోవడం ద్వారా దేశ చరిత్రలోనే మొదటిసారి ఇతర దేశంతో ఎంవోయూ చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించింది.. పరిశ్రమల అనుమతుల్లో మేడ్చల్ ప్రథమ స్థానంలో నిలువగా, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో రంగారెడ్డి జిల్లా అగ్రభాగాన నిలిచింది. జాతీయస్థాయిలో పలు అవార్డులు, రివార్డులను కూడా పరిశ్రమల శాఖ సొంతం చేసుకొన్నది.
సర్వేలో పారిశ్రామిక రంగం ముఖ్యాంశాలు…
పనిచేసే జనాభాలో 21 శాతం మందికి ఉపాధి అవకాశాలు సృష్టించింది.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరస్పర సహకారం, స్టార్టప్స్లో సహకారం అందించుకునేందుకు థాయ్లాండ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకొన్నది.
2021-22లో రాష్ట్రం నుంచి రూ. 81,971 కోట్ల విలువైన సరుకు ఎగుమతి జరిగింది.
ఎగుమతుల్లో ఔషధాలు, ఆర్గానిక్ కెమికల్స్ 57.31 శాతం కాగా, అత్యధికంగా 28.13 శాతం అమెరికాకు ఎగుమతి అయ్యాయి.
కేంద్ర పరిశ్రమలు మంత్రిత్వశాఖ ద్వారా టీ హబ్కు దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్గా గుర్తింపు లభించింది.
2014-15 నుంచి 2022-23 మధ్య టీఎస్ ఐపాస్ ద్వారా 22,110 అనుమతులు జారీ కాగా, రూ.2,53,575 కోట్ల పెట్టుబడులు, 17.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
21.20 శాతం పరిశ్రమల అనుమతులతో మేడ్చల్ మల్కాజ్గిరి, 8.01 శాతంతో సంగారెడ్డి, 7.54 శాతం అనుమతులతో రంగారెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
పెట్టుబడుల్లో 32.15 శాతంతో రంగారెడ్డి అగ్రభాగాన నిలువగా, 11.17 శాతంతో నల్గొండ రెండు, 9.05 శాతంతో భద్రాద్రి కొత్తగూడెం మూడో స్థానంలో నిలిచాయి.