Belated ITR | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు సోమవారం (జూలై 31)తో ముగిసింది. అనివార్య కారణాల వల్ల ఐటీఆర్ ఫైల్ చేయలేకపోవచ్చు. అలాగని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కాకపోతే పెనాల్టీ చెల్లించి బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టంలోని 234ఎఫ్ సెక్షన్ కింద పెనాల్టీ పే చేయాలి. ఇదిలా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రికార్డు స్థాయిలో 6.50 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి.
బీ లేటెడ్ ఐటీఆర్ కింద పెనాల్టీ పే చేసే వచ్చే డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000, రూ.5 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు రూ.5000 పెనాల్టీ పే చేయాలి. ఒకవేళ వారు పన్ను చెల్లించాల్సి వస్తే.. సదరు పన్నుపై నెలకు ఒకశాతం వడ్డీ వసూలు చేస్తారు.
పన్ను పరిధిలోకి రాని వారు ఏ రుసుము ఫైల్ చేయకుండానే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసేవారు పెనాల్టీ పే చేయాలి. నంబర్ చలాన్-280 కింద చలాన్ చెల్లించాలి. ఆన్లైన్లో ఎన్ఎస్డీఎల్ వెబ్ సైట్ ద్వారా గానీ, బ్యాంకు శాఖ నుంచి గానీ పెనాల్టీ పే చేయవచ్చు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి పెనాల్టీ చెల్లింపు విధానం అమల్లోకి తెచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. ఆగస్టు నుంచి డిసెంబర్ 31 వరకు రూ.5000, జనవరి- మార్చి మధ్య రూ.10 వేల పెనాల్టీతో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం కల్పించారు.
కానీ 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడుతూ పెనాల్టీతో బీ లేటెడ్ ఐటీఆర్ దాఖలు నిబంధన మార్చారు. ఇందుకోసం ఆదాయం పన్ను చట్టంలో 234ఎఫ్ సెక్షన్ చేర్చారు. గడువు తగ్గించడంతో పెనాల్టీ కూడా కుదించారు.
2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్లో రికార్డులు నమోదయ్యాయి. జూలై 31 అర్థరాత్రి ముగిసే వరకు 6.5 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 36.91 లక్షల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.83 కోట్ల ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి.