‘2010 నుంచి ఇప్పటి వరకు ఆభరణాల విక్రయాలు 100 టన్నులకు పడిపోవడం ఇది నాలుగోసారి. గరిష్ఠ స్థాయిలో ధరలు ఉండటం వల్లనే ఆభరణాలను కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. 2023లో కూడా పసిడికి డిమాండ్ పెద్దగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. రూపాయిపై పసిడి కొనుగోళ్లు ఆధారపడివున్నాయి’
– సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో
ముంబై, మే 5: పసిడి విక్రయాలకు ధరల పోటు పడింది. దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజవేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పడిపోయింది. ధర రికార్డు స్థాయికి చేరుకోవడం, ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుదలు లోనుకావడంతో వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తాజాగా వెల్లడించింది. 2023 జనవరి-మార్చికి సంబంధించిన గణాంకాలను డబ్ల్యూజీసీ శుక్రవారం విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 135.5 టన్నులు పసిడి విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.60 వేల స్థాయిలో ఉండంతో ఆభరణాల దుఖాణాలు వెలవెలబోతున్నాయి. అత్యవసరం అయితే తప్పా బంగారాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో గత త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ కూడా 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది.
గత కొద్ది రోజులుగా పుత్తడి ధర పెరిగిన ప్రతీ సందర్భంలోనూ వెనువెంటనే పడిపోతున్నది. ఆభరణాల డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ తగ్గుతున్నదని, మరోవైపు గ్లోబల్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారాన్ని విక్రయిస్తున్నాయంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెలువడిన రోజునే పుత్తడి ధర హఠాత్ పతనాన్ని చవిచూసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలతో గురువారం భారీగా పెరిగిన బంగారం అంతే స్పీడ్తో క్షీణించింది. ఏప్రిల్ నెలలో అమెరికాలో ఉద్యోగ నియమకాలు అంచనాలకంటే మించి పెరిగాయంటూ శుక్రవారం రాత్రి జాబ్స్ రిపోర్ట్ వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 40 డాలర్లమేర పతనమై 2,012 డాలర్ల వద్దకు తగ్గింది. ఈ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ భారత్లోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో 10 గ్రాముల పుత్తడి రూ.1,000పైగా క్షీణించి 60,400 సమీపంలో నిలిచింది. ఈ మేరకు వివిధ నగరాల్లోని స్పాట్ మార్కెట్లలో శనివారం ధర తగ్గవచ్చని బులియన్ నిపుణులు తెలిపారు.
అంతర్జాతీయంగా కూడా పసిడి విక్రయాలు పడిపోయాయి. ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా గత త్రైమాసికంలో 1,080.8 టన్నులు అమ్ముడైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,238.5 టన్నులతో పోలిస్తే 13 శాతం తగ్గింది. అమెరికాలో బ్యాంకింగ్ రంగం కుప్పకూలడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులతో పసిడికి డిమాండ్ పడిపోయిందని డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ అనలిస్ట్ లౌసీ స్ట్రీట్ తెలిపారు. వడ్డీరేట్లు పెరుగుతుండటంతో ఈ ఏడాది పసిడిపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు.