Home Loans | అధిక ధరల కట్టడి పేరిట వడ్డీరేట్లను ఆర్బీఐ వరుసగా పెంచడం వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కల.. కలగానే మిగులుతుందని రియాల్టీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచడం వల్ల వడ్డీరేట్లు పెరిగి ఇండ్ల రుణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నాయి. తాజా పెంపుతో ఆర్బీఐ 250 బేసిక్ పాయింట్లు పెంచినట్లయింది. రియాల్టీ అపెక్స్ బాడీ క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా మాట్లాడుతూ.. `అదేపనిగా వడ్డీరేట్లు పెంచడం వల్ల రుణాలు తీసుకోవాలని భావించే వ్యక్తులు, వ్యాపారవేత్తల సెంటిమెంట్ దెబ్బ తింటుంది` అని అన్నారు.
మరో రియాల్టీ సంస్థ నారెడ్కో నేషనల్ వైస్ చైర్మన్ నిరంజన్ హిరానందనీ స్పందిస్తూ ..`2022 మే నుంచి రెపోరేట్ 250 బేసిక్ పాయింట్లు పెంచడం భారత ఆర్థిక వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది` అని అన్నారు. ఇండ్ల రుణాలపై వడ్డీరేట్ల పెరుగుదల వల్ల చౌకధరకు ఇండ్లు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలు అడియాసలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ చైర్మన్ అనూజ్ స్పందిస్తూ.. `ఆర్బీఐ రెపోరేట్ ఇప్పుడు 6.5 శాతానికి చేరుకున్నది. మరింత పెరిగితే రుణాలపై ఇండ్ల కొనుగోళ్లపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది కాలంగా వరుసగా ఐదుసార్లు పెంచడంతో వడ్డీరేట్లు పైకి ఎగబాకాయి. ఇండ్ల రుణాలతో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఆర్థిక భారం కానున్నది.
మరోవైపు గత తొమ్మిది నెలలుగా ఇండ్లు, ఆస్తుల ధరలు కూడా పెరిగిపోయాయని అనరాక్ చైర్మన్ అనూజ్ గుర్తు చేశారు. తాజా బుధవారం రెపోరేట్ పెంపుతో ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 9.5 శాతానికి చేరితే.. చౌక, మధ్య తరగతి వర్గాల ఇండ్ల విక్రయాలపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ కం సీఈవో సంజయ్దత్ మాట్లాడుతూ వడ్డీరేట్లు మరింత పెరిగితే ఇండ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.