ముంబై, జూన్2: ఈ దఫా పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగించవచ్చన్న అంచనాల మధ్య బుధవారం రిజర్వుబ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న భయాలున్నందున, వడ్డీ రేట్లలో మార్పులేవీ కమిటీ చేయకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయం శుక్రవారం ప్రకటించనున్నది. రెండు నెలలకోసారి ఎంపీసీ సమావేశం వరుసగా మూడురోజులపాటు జరుగుతుంది. ఏప్రిల్లో జరిగిన గత సమీక్షలో కీలక వడ్డీరేట్లలో మార్పులేవీ చేయలేదు. రెపో రేటును 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద అట్టిపెట్టింది.
కరోనా సెకండ్వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు రిస్క్ పెరిగిందని, దీంతో రిజర్వుబ్యాంక్ సరళ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తుందని బ్రిక్వర్క్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ ఎం గోవిందరావు అంచనా వేశారు. అలాగే కమోడిటీ ధరలు, ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నందున ద్రవ్యోల్బణం రిస్క్ కూడా వుంటుందని, రెపో రేటును 4 శాతం వద్దే ఆర్బీఐ వుంచేందుకు ఇది కూడా కారణమవుతుందని ఆయన వివరించారు.