ముంబై, ఆగస్టు 18: ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లు మార్కెట్ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని, ఈ బ్యాంకుల్ని ప్రైవేట్పరం చేస్తే మంచికన్నా హాని ఎక్కువ జరుగుతుందని రిజర్వ్బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లాభాల్ని గరిష్టపర్చుకోవడం ఒక్కటే ప్రధాన ఉద్దేశ్యంకాకపోతే, పలు అంశాల్లో ప్రైవేట్ బ్యాంక్లకంటే ప్రభుత్వ బ్యాంకులే మెరుగని ఆర్బీఐ కితాబునిచ్చింది.
దేశంలో ఆర్థిక సేవలు విస్తరించడం, ద్రవ్య విధాన చర్యల్ని వేగంగా అమలుచేయడం వంటి అంశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లు ముందున్నాయన్నది. గురువారం ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్లో రాసిన వ్యాసంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్ల్లా లాభాల్ని పెంచుకునే ఒకేఒక లక్ష్యంతోనే ప్రభుత్వ రంగ బ్యాంక్లు (పీఎస్బీలు) ఉండవని, ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యాల సాధనకు కృషి చేస్తాయని ఆర్బీఐ వివరించింది.
ఇతర ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్ముతున్నట్టే బ్యాంక్ల్ని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుంకట్టిన సంగతి తెలిసిందే. రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్ల్లో మెజారిటీ వాటాను విక్రయించి, ప్రైవేటీకరించనున్నట్లు 2021 ఫిబ్రవరి 1నాటి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం సైతం విదితమే.
ప్రైవేటీకరణకు సంబంధించి యాజమాన్య వాటా, నియంత్రిత వాటా తదితర అంశాలపై బ్యాంకింగ్ రంగం రెగ్యులేటర్ ఆర్బీఐతో ఆర్థిక శాఖ చర్చలు జరుపుతున్నది కూడా. ప్రభుత్వ రంగ బ్యాంక్ల ప్రైవేటీకరణకు వీలుకల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రైవేశపెడుతుందన్న వార్తల నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తూ తాజాగా రిజర్వ్బ్యాంక్ గళమెత్తింది.
బ్యాలెన్స్ షీట్లు బలహీనపడ్డాయన్న విమర్శలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంక్లు కొవిడ్ పాండమిక్ షాక్ను ‘చాలా బాగా’ తట్టుకున్నాయని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. ఇటీవల జరిగిన పీఎస్బీల విలీనాలతో ఈ రంగంలో స్థిరీకరణ జరిగిందని, ఇవి మరింత బలోపేతం అయ్యాయని, పోటీతత్వాన్ని పెంపొందించుకున్నాయన్నది. ‘ రెండు బ్యాంక్ల్ని ప్రైవేటుపరం చేయాలన్న ఉద్దేశ్యాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
చిన్నగా మొదలైన ఇటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున బ్యాంక్ల ప్రైవేటీకరణకు దారితీయకూడదు. తద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ద్రవ్య విధానం అమలు వంటి ముఖ్యమైన సామాజిక లక్ష్యాల సాధనలో వైఫల్యాన్ని సృష్టించకూడదు’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ సునిశితంగా హెచ్చరించింది. 2020లో 10 జాతీయ బ్యాంకుల్ని నాలుగు పెద్ద బ్యాంక్ల్లో ప్రభుత్వం విలీనం చేయడంతో మొత్తం పీఎస్బీల సంఖ్య 12కు తగ్గింది.
బ్యాంక్ల బ్యాలెన్స్ షీట్స్లో మొండి బకాయిల భారాన్ని తొలగించడంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) తోడ్పడుతుందని, ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఐడీ) మౌలిక రంగానికి నిధులందించడం ద్వారా పీసీబీల ఆస్తిఅప్పుల అసమతౌల్యత తగ్గుతుందని ఆర్బీఐ వివరించింది. అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమన్న మూసధోరణి నుంచి వెలుపలికి వచ్చి, దానిని అమలుచేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది.