న్యూఢిల్లీ, మే 20: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 30,307 కోట్ల డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది. ఆర్బీఐ నిర్వహించే కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయంలో ఖర్చులు పోను మిగులును ప్రతీ సంవత్సరం కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఆ మిగులునే డివిడెండ్గా వ్యవహరిస్తారు.
2021-22 ఖాతా సంవత్సరానికి 5.50 శాతం మొత్తాన్ని కంటింజెన్సీ రిస్క్ బఫర్ కింద అట్టిపెట్టుకుని రూ. 30,307 కోట్ల మిగులును కేంద్రానికి బదిలీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటన తెలిపింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన శుక్రవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని, దేశీ, అంతర్జాతీయ సవాళ్లను, ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాల్ని బోర్డు చర్చించింది. అలాగే 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ పనితీరును సమీక్షించి, వార్షిక నివేదికను, 2021-22 ఖాతా సంవత్సరానికి ఖాతాల్ని ఆమోదించింది.
రిజర్వ్బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థల నుంచి 73,948 కోట్ల మొత్తం డివిడెండ్గా వస్తుందని ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో అంచనా వేశారు. ఇందులో రూ. 45,000 కోట్ల వరకూ ఆర్బీఐ నుంచి ఉంటుందని అంచనాకాగా, అంతకంటే తక్కువ డివిడెండ్నే చెల్లిస్తున్నది. అలాగే నిరుడు బదిలీ చేసిన మిగులుకంటే కూడా ఇది బాగా తక్కువ. గత ఏడాది మే నెలలో తొమ్మిది నెలల కాలానికి (2020 జూలై-2021 మార్చి) రూ. 99,122 కోట్ల డివిడెండ్ను రిజర్వ్బ్యాంక్ ప్రభుత్వానికి చెల్లించింది. మార్కెట్ కార్యకలాపాల ద్వారా అధికంగా ఆర్జించడం, కొన్ని విభాగాల్లో పుస్తక లాభాల్ని గడించడంతో నిరుడు ఆర్బీఐ చెల్లింపు అధికంగా ఉందని విశ్లేషకుల అంచనా. గతంలో జూలై-జూన్ మధ్య 12 నెలల కాలాన్ని రిజర్వ్బ్యాంక్ ఖాతా సంవత్సరంగా అనుసరించేది. ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంగా పరిగణించే ఏప్రిల్-మార్చి కాలాన్నే గత ఏడాది నుంచి అనుసరిస్తున్నది.