RBI retail e-rupee | ఎల్లుండి నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి అందుబాటులోకి రానున్నది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ-రూపాయిని ప్రారంభిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్ట్లో డిజిటల్ రూపాయి సృష్టి, పంపిణీ, రిటైల్ వినియోగం మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారు. అనంతరం రిటైల్ డిజిటల్ రూపాయిలో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తారు. పైలట్ ప్రాజెక్టు తొలుత ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. క్రమంగా అహ్మదాబాద్, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పట్నా, సిమ్లాలకు విస్తరించనున్నది.
పైలట్ ప్రాజెక్ట్లో ఎంపిక చేసిన ప్రదేశాలలో కస్టమర్లు, వ్యాపారుల క్లోజ్డ్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఈ-రూపాయి బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. వినియోగదారులు దీన్ని మొబైల్ ఫోన్లలోని డిజిటల్ వాలెట్లలో ఉంచుకోవచ్చు. ఈ డిజిటల్ వాలెట్ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి వ్యాపారికి లావాదేవీలు జరుగుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చెల్లింపులు జరుపవచ్చు. ఈ-రూపాయిని డబ్బు రూపంలోకి కూడా మార్చుకునే వీలు కల్పించారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం 8 బ్యాంకులను ఆర్బీఐ ఎంపిక చేసింది. అయితే, తొలి దశ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్తో సహా మరో నాలుగు బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో చేరనున్నాయి.
ఈ-రూపాయి విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీకి సమానంగానే ఉంటుంది. భౌతిక కరెన్సీ మాదిరిగానే అంగీకరిస్తారు. ఈ-రూపాయి అందుబాటుతో జేబులో నగదు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాలో ఉంచుకోవాలనే ఒత్తిడి ఉండదు. దీంతో నగదు రహిత చెల్లింపులు జరుపుకోవచ్చు. గుర్తుతెలియని వ్యక్తి సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గోప్యత పాటిస్తారు. ఈ-రూపాయి అందుబాటులోకి రావడంతో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. భౌతిక రూపాయి ముద్రణ ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే లావాదేవీ ఖర్చును తగ్గించడంలో కూడా సాయపడుతుంది.