RBI | ముంబై : బ్యాంక్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఫిన్టెక్ల నుంచి రుణాల కోసం వారాలు, నెలలు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రిజర్వ్బ్యాంక్ కొత్తగా పబ్లిక్ టెక్ ప్లాట్ఫాం ప్రారంభించింది. రుణదాతలు, రుణగ్రహీతల్ని అనుసంధానం చేస్తూ సులభంగా రుణ వితరణ చేసే ఈ ప్లాట్ఫాం పైలెట్ ప్రాజెక్ట్ గురువారం మొదలయ్యింది. దీని ద్వారా తనఖా అవసరం లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) రుణాలు, రూ.1.6 లక్షల వరకూ కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, పాల ఉత్పత్తిదారుల రుణాల్ని తొలుత ఆఫర్ చేస్తారు. ఈ ప్లాట్ఫాంలో చేరిన బ్యాంక్ల ద్వారా వ్యక్తిగత, గృహ రుణాల్ని సైతం అందిస్తారు. ఈ ప్లాట్ఫాంను ఆర్బీఐ సబ్సిడరీ రిజర్వ్బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ డెవలప్ చేసింది.
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంక్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, డిజిటల్ ఐడెంటిటీ సంస్థలు తదితరాల్ని ఈ ప్లాట్ఫాం ద్వారా అనుసంధానిస్తారు. దీంతో రుణ మంజూరీకి అవసరమైన డాటా వెనువెంటనే రుణాలిచ్చే బ్యాంక్లకు అందుతుంది, అయితే అవి వేరువేరు సిస్టమ్స్లో ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా రుణ వితరణ వేగంగా జరిగేందుకు ఉపకరిస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. అందుకున్న సమాచారాన్ని క్రోడీకరించి, పారదర్శకంగా, వేగంగా, తక్కువ వ్యయంతో రుణాల జారీ ప్రక్రియను ఈ డిజిటల్ ప్లాట్ఫాం పూర్తిచేస్తుంది.
రుణ మంజూరు చేసే ముందు వివిధ మార్గాల్లో రుణగ్రహీతకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంక్ సమీకరిస్తుంది. ఈ సమాచారం అంతా కొత్తగా ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా రుణదాతలకు ఆర్బీఐ అందుబాటులోకి తెస్తున్నది. ఆధార్ ఈ-కేవైసీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భూమి రికార్డులు, సెటిలైట్ డాటా, పాన్ కార్డ్ వ్యాలిడేషన్, ఆధార్ ఈ-సైనింగ్, అకౌంట్ అగ్రిగేటర్ల నుంచి అకౌంట్ ఆగ్రిగేషన్, ఎంపికచేసిన పాల సహకార సంఘాల నుంచి పాల సరఫరా గణాంకాలు, గృహం/ఆస్తి సెర్చ్ డేటా తదితరాలను ఈ ప్లాట్ఫాం లింకేజ్ చేస్తుందని ఆర్బీఐ వివరించింది.
పబ్లిక్ టెక్ ప్లాట్ఫాంను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు, తనఖా అవసరం లేని ఎంఎస్ఎంఈ రుణాలు ఇస్తున్నట్టు ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టుగా తొలుత మధ్యప్రదేశ్లో రూ.1.6 లక్షల వరకూ కేసీసీ రుణాలిస్తున్నామని, ఎంఎస్ఎంఈ రుణాలు రూ. 10 లక్షల వరకూ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.