Reporate | ఏప్రిల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోపాటు మున్ముందు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ దఫా ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపోరేట్ 6.50 శాతంగా ఉంది. ఈ నెల 6-8 తేదీల మధ్య ద్రవ్య పరపతి సమీక్ష జరుగుతుంది. ఈ నెల 8న ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడిస్తారు.
గతేడాది మే నుంచి వరుసగా వడ్డీరేట్లు పెంచడం వల్లే ద్రవ్యోల్బణం దిగి వస్తున్నదంటున్నారు నిపుణులు. ఏప్రిల్ ద్రవ్యోల్బణం 4.70 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది 18 నెలల కనిష్ట స్థాయి. అంతే కాదు.. వరుసగా రెండో నెలలో ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నియంత్రణ పరిధిలోనే నమోదైంది. మున్ముందు కూడా ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రణ స్థాయి 2-6 శాతం లోపే నమోదవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అంచనా వేశారు.
సమావేశ నిర్ణయాలను జూన్ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్లో జరిగిన సమావేశంలో రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. గతేడాది మే నుంచి వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
మే నెల ద్రవ్యోల్బణం కూడా మరింత దిగి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్ అవుతున్నందున ద్రవ్య లభ్యత కొనసాగుతుందని మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. అక్టోబర్ తర్వాత ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపోరేట్ 25-50 బేసిక్ పాయింట్లు తగ్గ వచ్చునన్నారు. కేవలం ద్రవ్యోల్బణంతోపాటు ఎకనమిక్ గ్రోత్, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సుస్థిరత, జాతీయ-అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రెపోరేట్ పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది.