మార్కెట్ పల్స్
వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ శుక్రవారం నాటి రికవరీతో వీక్లీ చార్ట్లో డోజీ క్యాండిల్ను ఏర్పాటు చేసింది. ఇది ఛానెల్ నిరోధక స్థాయి వద్ద ఏర్పాటుకావడంతో ఈ వారం కదలికలు మార్కెట్కు కీలకంగా మారాయి. మార్కెట్ 17800 దిగువన ప్రారంభం అయితే ఈసారి కూడా బేరిష్ సంకేతాలను అందించ వచ్చు. అయితే 18115 స్థాయికి ఎగువన మాత్రమే మార్కెట్ బుల్లిష్ సంకేతాలను అందిస్తుంది. గత నాలుగు రోజులుగా 50 , 200 రోజుల చలన సగటులు సమాంతరంగా కదులుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీల విలీనం వార్తలతో వచ్చిన భారీ పెరుగుదల వారాంతానికి పూర్తిగా కరిగిపోయింది. సోమవారం నాటి గ్యాప్ కూడా ఫిల్ అయింది. శుక్రవారం అవుట్సైడ్ బార్ ఏర్పాటు చేయడం వల్ల, 17600-842 స్థాయిలు మద్దతు, నిరోధక స్థాయిలు మారాయి. ఈ రెండింటి ఎగువన లేదా దిగువన నిఫ్టీ ముగిస్తే ఆ దిశగానే నిఫ్టీ కదలికలు ఉండబోతున్నాయి. ఒకవేళ సోమవారం 17842 స్థాయికి ఎగువన ముగిస్తే వీక్లీ చార్ట్లో ఎంఏసీడీ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 17600 స్థాయికి దిగువన ముగిస్తే 20 రోజుల చలన సగటు 17345 స్థాయి వద్ద తదుపరి మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో 17345-18115 స్థాయిలు కీలకం. ఈవారంలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు వెలువడనున్నందున మార్కెట్లలో భారీ కదలికలు ఉండవచ్చు.