ముంబై, డిసెంబర్ 19: అసలు అలాగే ఉంచుతూ దానిపై వడ్డీని మాత్రమే చెల్లిస్తూపోతున్న రుణాల (ఎవర్గ్రీనింగ్ ఆఫ్ లోన్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడంలో భాగంగా మంగళవారం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే ఏ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్లు) పథకంలోనూ పెట్టుబడులు పెట్టకుండా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లపై నిషేధం విధించింది.
ఆర్బీఐ నియంత్రణలో ఉన్న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ రెగ్యులర్ పెట్టుబడి కార్యకలాపాల కోసం ఏఐఎఫ్ల యూనిట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇవన్నీ ఆందోళనకరంగా మారుతున్నాయని గడిచిన ఏడాది కాలంగా ఆర్బీఐ గమనించింది. అందుకే ఏఐఎఫ్ల ద్వారా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే ఎవర్గ్రీనింగ్ లోన్ల కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా వీటి జోలికి వెళ్లవద్దని స్పష్టం చేసింది. కాగా, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ వంటి వాటిని ఏఐఎఫ్లుగా పరిగణిస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే ఉన్న ఈ రకమైన పెట్టుబడులను తిరిగి 30 రోజుల్లోగా వసూలు చేసుకోవాలని కూడా రుణదాతలకు ఆర్బీఐ ఈ సందర్భంగా తేల్చిచెప్పింది. ఈలోగా వసూలు చేసుకోకపోతే ఆ పెట్టుబడులను పూర్తిగా మొండి బకాయిలుగా పేర్కొనాల్సిందేనన్నది.