RBI | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ప్రముఖ బంగారం రుణాల మంజూరు సంస్థ మణపురం ఫైనాన్స్ (Manapuram Finance) సంస్థలపై భారతీయ రిజర్వు బ్యాంక్ కొరడా ఝుళిపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్పై రూ.90.92 లక్షలు, మణపురం ఫైనాన్స్ సంస్థపై రూ.42.78 లక్షల పెనాల్టీ విధించింది. యాక్సిస్ బ్యాంక్, మణపురం ఫైనాన్స్ సంస్థలు ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (కేవైసీ) మార్గదర్శకాలు-2016, లోన్లు – అడ్వాన్సులు- స్టాచుటరీ, అదర్ రిస్ట్రిక్షన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఓపెనింగ్ అండ్ ఆపరేటింగ్ కరంట్ అకౌంట్స్’ నిబంధనల అమలులో విఫలమయ్యాదని తమ పర్యవేక్షణలో తేలిందని ఆర్బీఐ పేర్కొంది.
బ్యాంకు ఖాతాదారుల లావాదేవీల నిర్వహణలో రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఈ నెల రెండో తేదీన యాక్సిస్ బ్యాంక్ మీద రూ.90.92 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు పేర్కొంది. `నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ-సిస్టమ్యాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వు బ్యాంక్) డైరెక్షన్స్-2016’ నిబంధనలను మణపురం ఫైనాన్స్ పాటించలేదని తేలింది. ఈ విషయమై తాము జారీ చేసిన నోటీసుకు సంత్రుప్తికరంగా సమాధానం రాకపోవడంతో పెనాల్టీ విధించామని ఆర్బీఐ పేర్కొంది. కేవైసీ నిబంధనల అమలులో విఫలమైనందుకు ఆనంద్ రాథీ గ్లోబల్ ఫైనాన్స్ సంస్థపై రూ.20 లక్షల పెనాల్టీ విధించింది.