ముంబై, మే 16 : గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రిటైల్, టోకు ధరల సూచీలు నాలుగేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈసారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలకాలంలో చమురు, పాల ధరలు పెరగడంతో ధరల సూచీలు అర శాతం వరకు అధికంకానున్నట్టు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వీటికితోడు రవాణా, లాజిస్టిక్స్, ఆహార పదార్థాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి ఉండటం కూడా మరో కారణం.