ముంబై, సెప్టెంబర్ 13: రిజర్వు బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నది. గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ నాలుగు నెలల గరిష్ఠానికి తాకడంతో ఈ నెల చివర్లో జరగనున్న పరపతి సమీక్షలో వడ్డీరేట్లను అర శాతం పెంచే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా నమోదుకావడంతో ఈ నెల 30న ప్రకటించనున్న సమీక్షలో వడ్డీరేటును అర శాతం వరకు పెంచొచ్చని బార్క్లేస్ బ్యాంక్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా తెలిపారు. వరుస నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంచుమించు 7 శాతం స్థాయిలో నమోదవుతున్నది. ద్రవ్యోల్బణ గణాంకాలు ఆమోద స్థాయి కంటే అధికంగా నమోదయ్యాయని, వచ్చే సమీక్షల్లోనూ రేట్లను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడం, మరోవైపు ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటం కూడా ధరల సూచీ పెరగడానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపోరేటు వచ్చే ఏడాది తొలి త్రైమాసికం చివరినాటికి 6.40 శాతానికి పెంచవచ్చని చెప్పారు.