ముంబై, మార్చి 7: గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని ప్రజలకు రిజర్వ్బ్యాంక్ సూచించింది. ఇటీవలికాలంలో డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ వంటి బ్యాంకింగ్ సమాచారాన్ని చెప్పవద్దంటూ ఆర్బీఐ సూచనలు జారీచేసింది. ‘అప్రమత్తం-ఆర్థిక మోసాలు జరిగే తీరు’ అనే అంశంపై కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన ఒక బుక్లెట్లో ఈ సూచనల్ని ప్రస్తావించింది. సామాన్య ప్రజల డబ్బును తస్కరించేందుకు మోసగాళ్లు వినూత్న పద్దతుల్ని అవలంబిస్తున్నారని, ముఖ్యంగా ఫైనాన్షియల్ టెక్నాలజీ పట్ల అవగాహన తక్కువగా ఉన్నవారిని సులభంగా బోల్తాకొట్టిస్తున్నారన్నది. మోసాలు జరగడానికి ప్రధాన కారణం తెలిసో, తెలియకో వినియోగదారులు రహస్య సమాచారాన్ని పంచుకోవడమేనని పలు ఫిర్యాదుల్ని విశ్లేషించిన మీదట తేలినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. యూజర్నేమ్, పాస్వర్డ్, కార్డ్ వివరాలు, సీవీవీ, ఓటీపీ ఎవరితోనూ, చివరకు స్వంత కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా షేర్చేయవద్దని సూచించింది.