Banks | ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చెప్పింది. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ ఒకటిన బ్యాంకులు సెలవుగా పరిగణిస్తుంటాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకులు తెరిచే ఉంచాలని చెప్పింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉండే అవకాశం ఉందన్న కేంద్రం ప్రభుత్వ సూచనల మేరకు బ్యాంకులను ఓపెన్ చేసి ఉంచాలని ఆర్బీఐ బ్యాంకులు సూచించింది. ఆర్బీఐ ఐదేశాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా ఆదివారం రోజున పని చేయనున్నాయి.
అదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ సైతం కార్యాలయాలకు వారాంతపు సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో బీఓబీ, బీఓఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూబీఐ వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి.
అలాగే యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఇండస్ఇండ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా, కోటక్ మహీంద్రా, ఆర్బీఎల్, సౌత్ ఇండియన్, ఎస్ బ్యాంక్, ధనలక్ష్మీ బ్యాంక్, బంధన్ బ్యాంకు, సీఎస్బీ, తమిళనాడు మర్కంటైల్, డీబీఎస్ బ్యాంక్ సైతం తెరిచే ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.