ముంబై, జూన్ 4: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్ లేదా నాచ్) సేవలు అన్ని రోజులూ అందుబాటులో ఉండనున్నాయి. ఆగస్టు 1 నుంచి 24 గంటలూ నాచ్ సదుపాయం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలోని ఆరుగురు సభ్యులుగల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రధానంగా కరోనా పరిస్థితుల వల్లే రెపో, రివర్స్ రెపో జోలికి కమిటీ వెళ్లలేకపోయింది. ఇక ఈ సందర్భంగానే నెఫ్ట్, ఆర్టీజీఎస్ తరహాలో నాచ్ సేవలనూ నిరంతరం చేస్తున్నామని గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నాచ్ సేవలు బ్యాంక్ పని దినాల్లో మాత్రమే లభ్యమవుతున్న విషయం తెలిసిందే.
నాచ్.. ఓ బల్క్ పేమెంట్ వ్యవస్థ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీన్ని నిర్వహిస్తున్నది. డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ ఇలా ఒక్కటేమిటి అనేక రకాల చెల్లింపులు దీని ద్వారానే చేసుకోవచ్చు. అంతేగాక విద్యుత్తు, గ్యాస్, టెలిఫోన్, నీటి బకాయిలతోపాటు వివిధ రుణాల ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు, బీమా ప్రీమియం వసూళ్లనూ జరుపుకోవచ్చు. నగదు బదిలీ (డీబీటీ) విధానం వచ్చిన దగ్గర్నుంచే నాచ్కు ఆదరణ పెరిగింది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో సమయానికి లబ్ధిదారులకు ప్రభుత్వ రాయితీలు అందడానికీ నాచ్ ఎంతో ఉపయోగపడుతున్నది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ ప్రధాన దృష్టి దేశ ఆర్థికాభివృద్ధి మీదే ఉంటుందని గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. మహమ్మారి ధాటికి కుదేలైన కీలక రంగాలు గాడినపడితే వృద్ధిరేటు పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకే మరోసారి ద్రవ్యవిధానంపై వేచిచూసే ధోరణిని అవలంభించామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. గతంలో 10.5 శాతంగా ఉండొచ్చన్న దాస్.. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈసారి 9.5 శాతానికే పరిమితం చేశారు. అలాగే తొలి త్రైమాసికంలో 18.5% వృద్ధిరేటుకు వీలుందన్న ఆయన.. క్యూ2లో 7.3%, క్యూ3 లో 7.2%, క్యూ4లో 6.6% నమోదు కావచ్చన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండొచ్చని దాస్ అంచనా వేశారు. క్యూ1లో 5.2%, క్యూ2లో 5.4%, క్యూ3లో 4.7%, క్యూ4లో 5.3 శాతంగా ఉండొచ్చన్నారు. కీలక వడ్డీరేట్ల మార్పునకు ద్రవ్యోల్బణాన్నే ఆర్బీఐ కొలమానంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వానికి మిగులు నగదు నిల్వల బదిలీపై దాస్ మాట్లాడారు. నిరుడు జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకుగాను సర్కారుకు రూ.99,122 కోట్లను డివిడెండ్ రూపంలో ఆర్బీఐ ఇచ్చిన నేపథ్యంలో తమ వద్ద నిధులుంటేనే ఇస్తామని స్పష్టం చేశారు. అంతేగానీ ఆర్బీఐ విధానంలో ఎలాంటి మార్పూ లేదన్నారు.
బిట్కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ దృక్పథంలో ఎలాంటి మార్పూ రాలేదని దాస్ స్పష్టం చేశారు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఈ అదృశ్య కరెన్సీలకు సంబంధించి ఇప్పటికీ మాకు ఆందోళనే ఉందన్నారు. ప్రభుత్వానికీ చెప్తూనే ఉన్నామని తెలిపారు. 2018 ఆర్బీఐ సర్క్యులర్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన సంగతి విదితమే.
‘ఈ కష్టకాలంలో ఆర్బీఐ మద్దతును స్వాగతిస్తున్నాం’ -అసోచామ్
‘పరిశ్రమకు అండగా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలున్నాయి’ -సీఐఐ
‘ఈ సంక్షోభంలో బ్యాంకులు పరిశ్రమకు చేయూతనివ్వాలి’ -ఫిక్కీ