RBI on Credit Cards | క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీ విషయమై వివిధ నిబంధనల అమలు కోసం బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లకు ఆర్బీఐ మూడు నెలల గడువు పొడిగించింది. కస్టమర్ల ఆమోదం లేకుండా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల యాక్టివేషన్ చేయరాదు. క్రెడిట్/ డెబిట్ కార్డు జారీ- నిర్వాహక మార్గదర్శకాలు-2022 పేరిట బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు మాస్టర్ డైరెక్షన్ జారీ చేసింది ఆర్బీఐ. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. కానీ, ఈ విషయమై పరిశ్రమలోని వివిధ వాటాదారులు ఆర్బీఐని సంప్రదించి సమయాన్ని పొడిగించాలని కోరాయి. దీంతో ఈ నిబంధనల అమలను అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
క్రెడిట్ కార్డుల యాక్టివేషన్ కోసం మరింత సమయం ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం.. ఒకవేళ క్రెడిట్ కార్డు జారీ చేసిన తర్వాత 30 రోజులు దాటినా కస్టమర్ యాక్టివేట్ చేయకున్నా.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కోసం కార్డు దారుడి నుంచి బ్యాంకులు వన్టైం పాస్ వర్డ్ (ఓటీపీ) తప్పనిసరిగా కోరాలని ఆ సర్క్యులర్ సారాంశం.
క్రెడిట్ కార్డు యాక్టివేష్ కోసం కస్టమర్ నుంచి ఆమోదం రాకపోతే వారం రోజుల్లో ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా సదరు క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచే విషయంలోనూ సంబంధిత కార్డు యజమాని నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.