Repo Rate | వచ్చే ఏడాది జూన్ వరకు వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ డచెస్ బ్యాంక్ పేర్కొంది. బుధవారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎంపీసీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనున్నది.
ఇప్పటికే కీలక వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో మరో దఫా ఆర్బీఐ రెపోరేట్ పెంచక పోవచ్చు. అలాగని జూన్ వరకూ యథాతథంగా వడ్డీరేట్లు కొనసాగుతాయని భావిస్తున్నట్లు డచెస్ బ్యాంక్ పేర్కొంది. జూన్ తర్వాతే ఆర్బీఐ రెపోరేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గత ఫిబ్రవరిలో చివరి సారిగా ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడంతో రెపోరేట్ ఆల్ టైం గరిష్ట స్థాయి 6.5 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల స్వల్ప కాలిక రుణాలపై వడ్డీరేట్లు 6.85-6.90 శాతంగా ఉన్నాయి.
2024లో రెపోరేట్లో 75 బేసిక్ పాయింట్లు, 2025 ప్రారంభంలో 25 బేసిక్ పాయింట్ల మేరకు కోత విధిస్తారని భావిస్తున్నామని డచెస్ బ్యాంక్ తెలిపింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా 2024 ఏప్రిల్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తున్నది. 2025 నాటికి ఆర్బీఐ రెపోరేట్ 5.50 శాతానికి దిగి వస్తుందని భావిస్తున్నామని డచెస్ బ్యాంక్ వెల్లడించింది. అదీ కూడా యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాలకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోనున్నది.