RBI | రూ.2వేలనోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి మూడింట రెండువంతుల నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయని ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించామని, అదే నెల 23 నుంచి నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. మొత్తం రూ.3.62లక్షల కోట్ల విలువ రూ.2వేల నోట్లు చెలామణిలో ఉండగా.. ఇందులో రూ.2.41 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. నోట్లను డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
గడువు ముగిసే వరకు మిగతా నోట్లు సైతం బ్యాంకుల్లో జమవుతాయని ఆర్బీఐ అంచనా వేస్తున్నది. అయితే, నోట్ల ఉపసంహరణతో ద్రవ్య స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆర్బీఐ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతంగా ఉంటుందని ఆర్బీఐ, ప్రభుత్వం అంచనా వేశాయి. ఆర్బీఐ 2016లో రూ.2వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత 2018-19లోనే కొత్తగా రూ.2వేలనోట్ల ముద్రణను నిలిపివేయగా.. ఈ ఏడాది మేలో మొత్తం రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా నోట్లను బ్యాంకుల్లో తిరిగి జమ చేయడంతో పాటు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది.