ముంబై, ఆగస్టు 3: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేటును మరోసారి పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రెపోరేటు కనీసం 35 బేసిస్ పాయింట్లు పెరగవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా గత రెండు ద్రవ్యసమీక్షల్ని చేపట్టిన ఆర్బీఐ.. రెపోరేటును భారీగానే పెంచిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మూడు రోజుల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్ష బుధవారం మొదలైంది. శుక్రవారం నిర్ణయం వెలువడుతుంది. రెపోరేటు మరో 0.35 శాతమైనా పెరుగుతుందంటున్నారు. నిజానికి ఇటీవలి ద్రవ్యసమీక్షలోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచింది. ఈ పరిణామం కూడా ఆర్బీఐ వడ్డింపులకు దారితీయగలదని చెప్తున్నారు. కాగా, ఎవరూ ఊహించనివిధంగా ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపోరేటును ఆర్బీఐ పెంచిన సంగతి విదితమే. దీంతో ప్రస్తుతం రెపోరేటు 4.9 శాతానికి చేరింది.
అయినప్పటికీ కరోనా కంటే ముందున్న స్థాయికి తక్కువే. 2020 మార్చికి మునుపు 5.15 శాతంగా ఉండేది. కానీ ఈసారి సమీక్షలో ఈ స్థాయిని మించిపోయేలా ఉన్నది. కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడంలో భాగంగా రెపోరేటును తగ్గించిన ఆర్బీఐ.. పరిస్థితులు చక్కబడటంతో పెంచుతూపోతున్నది. పైగా ద్రవ్యోల్బణం ముందుగానే ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూపోతుండగా, జూన్లో 7.01 శాతంగా నమోదైంది. ఆర్బీఐ డెడ్లైన్ 6 శాతాన్ని దాటేసింది. హోల్సేల్ ద్రవ్యోల్బణం సైతం రెండంకెల్లో కదలాడుతున్నది.
ఆగేది అక్టోబర్ తర్వాతే..
ఈసారి ద్రవ్యసమీక్షలో రెపోరేటు 25-30 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని యూబీఎస్ అంచనా వేస్తున్నది. అక్టోబర్దాకా ఇలా పెరుగుతూనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న ఈ విదేశీ బ్రోకరేజీ దిగ్గజం.. ఆ తర్వాతే ఈ వడ్డింపులు ఆగిపోయే వీలుందని చెప్తున్నది. అధిక కరెంట్ ఖాతా లోటు, విస్తరిస్తున్న వాణిజ్య లోటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ మారకం నిల్వలు.. ఆర్బీఐని ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నది.