న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున్నట్టు ఆర్బీఐ చెప్తున్నది. వడ్డీరేటు, ఇతరత్రా ఖర్చుల గురించిన అన్ని వివరాలను రుణగ్రహీతలకు రుణదాతలు తప్పక అందజేయాల్సిందే. లోన్ అగ్రిమెంట్లో ఉండే భాష కూడా సరళంగా ఉండనున్నది.
సంస్థాగత రుణాలకు వసూలు చేసే బీమా, లీగల్ ఫీజులకు సంబంధించిన మొత్తాలనూ లోన్ అగ్రిమెంట్లలో పేర్కొనాల్సిందే. వార్షిక పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్)లో థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లూ భాగమే అవుతారు. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)లో పేర్కొనని ఏ చార్జీలనైనా రుణగ్రహీతల అనుమతి, అంగీకారాలతోనే రుణదాతలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పింది. అయితే క్రెడిట్ కార్డుల విషయంలో మాత్రం ఈ కొత్త నిబంధనలు వర్తించబోవన్నది.