(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పొద్దున బీరువాలో పెట్టిన పెద్ద నోటు.. రాత్రివరకు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియని అయోమయ స్థితిలో భారత ప్రజానీకం కూరుకుపోయింది. కరెన్సీపై కేంద్రంలోని బీజేపీ సర్కారు తరుచూ క్లినికల్ ట్రయల్స్ చేస్తుండటమే దీనికి కారణం. కేంద్రం తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు కరెన్సీపై ఉన్న విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నది. దీంతో ఏ నోటు చలామణిలో ఉంటుందో.. ఏ నోటు ఎప్పుడు చిత్తుకాగితంగా మారిపోతుందోనని ప్రజలు భయంతో గడుపుతున్నారు. రూ. 2 వేల నోటును ఉపసంహరించుకొన్నట్టే, రూ. 500 నోటును కూడా వెనక్కి తీసుకొంటారన్న ఊహాగానాలు పెద్దయెత్తున ప్రచారమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం స్పష్టతనిచ్చారు. రూ. 500 నోటును ఉపసంహరించుకోవడం, రూ. 1000 నోటును తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఏమీ లేదని వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం (విలువ రూ. 1.8 లక్షల కోట్లు) రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు చేరినట్టు వివరించారు. ‘నోట్లను రద్దు చేయబోమ’ని ఆర్బీఐ తరుచూ ఇలాంటి వివరణలు గతంలోనే ఇవ్వడం, అనంతరం రద్దుచేస్తూ అనాలోచితంగా నిర్ణయాలను ఏకపక్షంగా అమలుచేస్తుండటంతో.. నగదును దగ్గర పెట్టుకోవడానికి సామాన్యులు భయపడుతున్నారు.
142 కోట్ల జనాభా, రూ. 272 లక్షల కోట్ల విలువ గల జీడీపీ భారత్ సొంతం. అసంఘటిత రంగంలో 94 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి సంక్లిష్టమైన ఆర్థిక స్థితిగతులు కలిగిన మన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీసుకొనే నిర్ణయాలపట్ల ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ఇవేమీ పట్టించుకోని బీజేపీ సర్కారు.. 2016లో రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేసింది. రూ. 2 వేలు, రూ. 500 కొత్త నోట్లను తీసుకొచ్చింది.
గత నెలలో రూ. 2 వేల కొత్త నోటును కూడా వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో జేబులో పెద్దనోటును పెట్టుకోవాలంటేనే ప్రజలు భయపడే స్థితికి చేరుకొన్నారు. ఇదిలాఉండగా.. రూ. 10, రూ. 20 నాణేలు చెల్లబోవని ఒక ప్రచారం జరుగడంతో వాటిని తీసుకోవడానికి ఇప్పటికీ ఎవరూ సిద్ధపడట్లేదు. వాటి చెల్లుబాటుకు సంబంధించి ఆర్బీఐ స్వయంగా ఎన్నిసార్లు ప్రకటనలు చేసినప్పటికీ, ప్రజల్లో మార్పు రావట్లేదు. ప్రభుత్వం తీసుకొంటున్న అపరిపక్వ నిర్ణయాలతో కరెన్సీపై ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నదనడానికి ఇదే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికన్ డాలర్ను అంతర్జాతీయంగా ప్రామాణిక కరెన్సీగా పరిగణిస్తారు. ఒక కువైట్ దినార్కు 3.25 అమెరికన్ డాలర్లు వస్తే, ఒక అమెరికన్ డాలర్ను కొనుగోలు చేయాలంటే, 82 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాల శక్తివంతమైన కరెన్సీ ర్యాంకుల్లో ఇండియా కరెన్సీ 124 స్థానానికి పరిమితమైంది. కరెన్సీపై ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కూడా ఈ ర్యాంకుపై ప్రభావం చూపినట్టు నివేదికలు చెబుతున్నాయి.