Paytm | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రిజర్వ్బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు చెందిన పేటీఎం యాప్ ఇకముందు కూడా పనిచేసేలా చూడాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కేంద్ర బ్యాంక్ కోరింది. పేటీఎం యాప్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపుల్ని కొనసాగించేందుకు దానిని ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ను చేసే అవకాశాల్ని పరిశీలించమని ఎన్పీసీఐని కోరినట్టు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. 2024 మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారులు, వ్యాలెట్లలో నగదు జమచేసుకోరాదంటూ ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే పేటీఎం హ్యాండిల్ను ఉపయోగించుకుని యూపీఐ కస్టమర్లు నిరంతరాయంగా డిజిటల్ చెల్లింపులు జరుపుకోవాలన్న లక్ష్యంతో పేటీఎం యాప్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా వ్యవహరించే అంశాన్ని పరిశీలించాలని ఎన్పీసీఐకి కోరినట్టు రిజర్వ్బ్యాంక్ వివరించింది. టీపీఏపీగా వ్యవహరించే అనుమతిని ఇవ్వాలంటూ పేటీఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్ విజప్తి చేసినట్టు ఆర్బీఐ ప్రకటన తెలిపింది. అలాగే పేటీఎం హ్యాండిల్ నుంచి ఇతర బ్యాంక్లకు కస్టమర్లు మారడానికి వీలయ్యేలా అధిక పరిమాణంతో యూపీఐ లావాదేవీల్ని ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉన్న 4-5 బ్యాంక్లకు ఎన్పీసీఐ సర్టిఫికేషన్ ఇస్తుందని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది.