RBI | ముంబై, మార్చి 27: వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల షెడ్యూల్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ప్రకటించింది. తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరుగనున్నది. రెండోది జూన్ 5న మొదలవుతుంది. 2024-25లో మొత్తం 6 ఎంపీసీ మీటింగ్స్ జరుగుతాయి. ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిగతా 4 సమావేశాలుంటాయి. ప్రతీ సమావేశం 3 రోజులు జరుగుతుంది. చివరి రోజు మధ్యాహ్నంలోగా నిర్ణయం ఉంటుంది.
ద్రవ్యవిధాన కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. ఇందులో ముగ్గురు ఎక్స్టర్నల్ మెంబర్స్. వీరందరికీ ఆర్బీఐ గవర్నర్ (ప్రస్తుతం శక్తికాంత దాస్) నాయకత్వం వహిస్తారు. ఇక మెజారిటీ సభ్యుల తీర్మానం ఆధారంగా పాలసీ నిర్ణయాలను గవర్నరే ప్రకటిస్తారు. కాగా, సమీక్ష తొలి రెండు రోజులు ద్రవ్యోల్బణం, దేశ-విదేశీ ఆర్థికాంశాలపై నిపుణులంతా చర్చిస్తారు. తదనంతరమే కీలక వడ్డీరేైట్లెన రెపో, రివర్స్ రెపోలను తగ్గించడమో, పెంచడమో లేక యథాతథంగా ఉంచడమో చేస్తారు. ఇక బ్యాంకింగ్, కరెన్సీ మార్కెట్లకు సంబంధించి పలు నిర్ణయాలనూ తీసుకుంటారు. గత మే నుంచి వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతున్నది.