న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్కు బదిలీ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి 10.24 కోట్ల ఖాతాల్లోని రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐకి బదిలీ చేశామని లోక్సభకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఓ లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. ఈ డిపాజిట్లన్నీ పదేండ్లు, ఆపైబడిన కాలం నుంచి బ్యాంకుల వద్ద అలాగే ఉంటున్నాయని, వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. కాగా, వీటిలో ఎస్బీఐకి చెందినవే అత్యధికంగా రూ.8,086 కోట్ల డిపాజిట్లున్నాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5, 340 కోట్లు), కెనరా బ్యాంక్ (4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు)ల్లోని డిపాజిట్లున్నాయి.