ముంబై, సెప్టెంబర్ 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో దాస్ ‘ఏ ప్లస్’తో టాప్లో ఉన్నారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023’ పేరిట ఈ ర్యాంకులు విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపు, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీరేట్ల నిర్వహణ అంశాల ప్రాతిపదికన ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ చీఫ్లకు ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్లను ఇచ్చారు.
ఏ ర్యాంకు అత్యుత్తమ ప్రదర్శనను సూచిస్తుండగా, ఎఫ్ ర్యాంకు వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నది. కాగా, దాస్ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జే జోర్డాన్, వియత్నాం చీఫ్ గుయెన్ థి హాంగ్ ఉన్నారు. ఈ ఏడాది జూన్లో లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డునూ దాస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఈ నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టవచ్చని దాస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇండోర్లోని దేవీ అహల్య యునివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మరోవైపు చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. గత నెలాఖరుకల్లా ఇంకా చలామణిలో ఉన్నవి రూ.0.24 లక్షల కోట్లేనని పేర్కొన్నది. 2వేల నోట్లను రద్దు చేసినది తెలిసిందే.