Shakti Kanta Das | ఇండ్ల రుణాలు మొదలు కారు లోన్లు, పర్సనల్ లోన్లపై మరికొంత కాలం వడ్డీరేట్లు పెరుగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తేల్చి చెప్పారు. వివిధ రుణాలపై తక్షణం రిలీఫ్ లభించకపోవచ్చునని ఇటీవలే ఆయన సంకేతాలిచ్చారు. ఒకవేళ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరికొంత కాలం కొనసాగితే సుదీర్ఘ కాలం వివిధ రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు. వస్తువుల సరఫరాలో సమస్యలు పరిష్కారమై, పరిస్థితులు చక్కబడితే ద్రవ్యోల్బణం తగ్గి వస్తుందన్నారు.
`ఫిబ్రవరిలో జరిగే ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలకు ఇది సంకేతం కాదు. ఒకవేళ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగితే మాత్రం సుదీర్ఘ కాలం వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. యావత్ ప్రపంచం అంతటా ఇలాగే ఉంటుంది` అని శనివారం ఓ ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్ చెప్పారు.
అంతర్జాతీయంగా వస్తువుల సరఫరాలో సమస్యలు తగ్గితే ద్రవ్యోల్బణం దిగి వస్తుందన్నారు శక్తికాంత దాస్. నిరంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినా.. కొత్త పరిస్థితులకు అలవాటు కావడం మానవ సమాజానికి తెలుసునన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు కొత్త మార్గాలు సిద్ధం అవుతున్నాయన్నారు.
ఆరు నెలల క్రితం అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ భావించారని శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక మందగమనం ఇంతకుముందుతో పోలిస్తే నెమ్మదించొచ్చునని అన్నారు. అనిశ్చిత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి ఇంకా ఏడెనిమిది నెలలు పడుతుందని ఆయన తెలిపారు.