ముంబై, జనవరి 23: బ్యాంక్ల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు కలిగిన ఖాతాదారులకు రిజర్వ్బ్యాంక్ ఊరటనిచ్చింది. ఈ లాకర్లపై బ్యాంక్లతో ఖాతాదారులు ఈ జనవరి 1నాటికే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్టు సోమవారం ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్, టెక్నాలజీ, వినియోగదార్ల వివాదాలు వంటి అంశాల్లో తలెత్తుతున్న పరిణామాల రీత్యా ప్రస్తుత లాకర్ హోల్డర్లతో 2023 జనవరి 1కల్లా సవరణ ఒప్పందాల్ని కుదుర్చుకోవాలంటూ 2021 ఆగస్టులో ఆర్బీఐ బ్యాంక్ల్ని ఆదేశించింది. అయితే సవరణ ఒప్పందాలపై మెజారిటీ కస్టమర్లు ఇంకా సంతకాలు చేయాల్సి ఉందని ఇటీవల ఆర్బీఐ నోటీసులోకి వచ్చింది.
జనవరి 1కల్లా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయాలన్న విషయాన్ని కూడా చాలామంది కస్టమర్లకు బ్యాంక్లు తెలియపర్చలేదన్న సంగతి తమ దృష్టిలోకి వచ్చిందని ఆర్బీఐ పేర్కొంది. ఈ ఒప్పందాల రెన్యువల్కు ప్రక్రియను పూర్తి చేయడానికి గడువు తేదీని 2023 డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నామని, ఏప్రిల్ 30 కల్లా లాకర్హోల్డర్లకు ఈ అంశాన్ని నోటీఫై చేయాలంటూ బ్యాంక్ల్ని ఆదేశించినట్టు రిజర్వ్బ్యాంక్ వివరించింది. ఒప్పందాల రెన్యువల్కు అవసరమైన తాజా/అనుబంధ స్టాంప్ పేపర్లు, ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్, ఈ-స్టాంపింగ్ తదితర సదుపాయాల్ని బ్యాంక్లు కల్పిస్తామని, ఒప్పందపు కాపీని కస్టమర్లకు ఇస్తాయని కేంద్ర బ్యాంక్ వివరించింది. అలాగే 2023 జనవరి 1కల్లా ఒప్పందాన్ని రెన్యువల్ చేయనందుకు లాకర్లను ఫ్రీజ్ చేసిఉంటే, వాటిని తక్షణం అన్ఫ్రీజ్ చేయాలంటూ బ్యాంక్ల్ని ఆదేశించింది.