న్యూఢిల్లీ, జూలై 18: క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళనల్ని వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలు అస్థిరమైనవని, దేశ ద్రవ్య-ఆర్థిక సుస్థిరతలపై అవి ప్రభావం చూపిస్తాయని రిజర్వ్ బ్యాంక్ అన్నట్టు సోమవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి చెప్పారు. కాబట్టి క్రిప్టోకరెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించాలని ఆర్బీఐ కోరుకుంటున్నట్టు వివరించారు. అలాగే క్రిప్టోకరెన్సీల నియంత్రణకు ఓ చట్టాన్ని తీసుకురావాలని కూడా సెంట్రల్ బ్యాంక్ సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీలు అనేవి కరెన్సీ కాదని, ఎందుకంటే ఏ ప్రభుత్వంగానీ.. మరే రిజర్వ్ బ్యాంక్గానీ వాటిని జారీ చేయడం లేదని ప్రభుత్వానికి ఆర్బీఐ తెలియజేసినట్టు ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నిజానికి 2013 నుంచే క్రిప్టోకరెన్సీలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్బీఐ వీలైనప్పుడల్లా చెప్తూనే ఉన్నది. ఈ లావాదేవీలకు బ్యాంకులు దూరంగా ఉండాలని, బాధితుల ఫిర్యాదులు తమ పరిధిలోకి రాబోవని, పోలీసుల వద్దకే వెళ్లాలనీ అంటున్నది. అయినప్పటికీ మోదీ సర్కారు క్రిప్టోకరెన్సీలపట్ల ఆసక్తిని కనబరుస్తుండటం గమనార్హం. చివరకు ఓ డిజిటల్ కరెన్సీని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
జీఎస్టీ పరిహారం మరో ఐదేండ్లివ్వాలి
తెలంగాణసహా దేశంలోని పలు రాష్ర్టాలు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారాన్ని మరో ఐదేండ్లు ఇవ్వాలని కోరుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో అన్నారు. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 రకాల పన్నులను ఏకం చేస్తూ ఈ జీఎస్టీని పరిచయం చేయగా.. దీనివల్ల రాష్ర్టాలకు ఏర్పడే రెవిన్యూ నష్టాలకుగాను ఐదేండ్లు పరిహారం ఇస్తామనీ కేంద్రం హామీ ఇచ్చిన సంగతీ విదితమే. అయితే ఈ ఏడాది జూన్ 30తో ఈ ఐదేండ్ల కాలం పూర్తయ్యింది. దీంతో మరో ఐదేండ్లు ఈ పరిహారాన్ని పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్టు మంత్రి సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. కాగా, ఇటీవలి జీఎస్టీ మండలి 42వ సమావేశంలో పరిహారాన్ని పొడిగించాలని ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు సిఫార్సు కూడా చేశారు.
పెరిగిన జీఎస్టీ భారం
జీఎస్టీ శ్లాబుల్లో చేసిన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడినైట్టెంది. 25 కేజీల లోపున్న పిండి, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహారోత్పత్తులపై ఇక 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. 25 లీటర్లకు దిగువన ఉండే పెరుగు, లస్సీ వంటి వాటికీ పన్నుంటుంది. రూ.5వేలు ఆపై అద్దెకలిగిన దవాఖాన గదులకూ పడుతున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాలిచ్చింది. ఇప్పటిదాకా జీఎస్టీ పరిధిలోలేని పలు ఉత్పత్తులను ఇటీవలి జీఎస్టీ మండలి సమావేశంలో 5 శాతం శ్లాబులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువ నిత్యావసరాలే ఉండగా, సామాన్యులే తీవ్రంగా ప్రభావితం కానున్నారు.