RBI | ముంబై, జనవరి 3: రెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. అలాగే స్కాలర్షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం తీసుకున్న ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరుగకున్నా.. వాటిని ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా పేర్కొనరాదనీ స్పష్టం చేసింది.
అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా, ఇన్ఆపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్లో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ‘బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు/యజమానులు/వారసులకు చేరడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు కలిసొస్తాయని ఆశిస్తున్నాం’ అని ఈ సందర్భంగా సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొన్నది.