న్యూఢిల్లీ, డిసెంబర్ 29: వాణిజ్యలోటు అధికంకావడంతో దేశీ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.2 శాతంగా (18.2 బిలియన్ డాలర్లు) నమోదైన క్యాడ్ జూలై-సెప్టెంబర్లో 4.4 శాతానికి (36.4 బిలియన్ డాలర్లు) చేరిపోయింది. ఇదే సమయంలో వ్యాపారోత్పత్తుల ఎగుమతుల వాణిజ్యలోటు 63 బిలియన్ డాలర్ల నుంచి 83.5 బిలియన్ డాలర్లకు చేరడం క్యాడ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. దేశంలోకి వచ్చే, పోయే విదేశీ మారకంలో వ్యత్యాసాన్ని క్యాడ్గా పిలుస్తారు.
సర్వీసుల ఎగుమతుల్లో 30 శాతం వృద్ధి
సాఫ్ట్వేర్, బిజినెస్, ట్రావెల్ సర్వీసుల జోరు కారణంగా మొత్తంగా సేవల ఎగుమతులు ఈ ద్వితీయ త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 30.2 శాతం వృద్ధి చెందాయని ఆర్బీఐ వెల్లడించింది. నికర సర్వీసుల ఎగుమతులు గత ఏడాది ద్వితీయ త్రైమాసికంతో పోల్చినా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చినా వృద్ధి చెందాయన్నది.
క్యాడ్కు విదేశీ పెట్టుబడుల సాయం
నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా వస్తుండటం, 2022 జూలై నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తిరిగి రావడంతో కరెంటు ఖాతా లోటును సజావుగా పూడ్చగలుగుతామని ఆర్బీఐ గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో వివరించింది. పెట్టుబడుల ఆదాయానికి సంబంధించిన చెల్లింపులు ఈ క్యూ2లో 9.8 బిలియన్ డాలర్ల నుంచి 12 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నది.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వివరాల ప్రకారం ప్రవాస భారతీయులు దేశంలోకి పంపిస్తున్న రెమిటెన్సులు 29.7 శాతం వృద్ధిచెంది 27.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. నికర విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు 3.9 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ద్వితీయ త్రైమాసికంలో 30.4 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వలు తరిగిపోయినట్టు ఆర్బీఐ తెలిపింది.