ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేసింది. సోలాపూర్లోని లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను గురువారం క్యాన్సిల్ చేసింది. బ్యాంక్ను మూసివేయడానికి, బ్యాంక్కు లిక్విడేటర్ను నియమించడానికి ఉత్తర్వులు జారీ చేయాలని మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్ను ఆర్బీఐ కోరింది. దీంతో ఆ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు గురువారం నుంచి నిలిచిపోయాయి.
కాగా, లైసెన్స్ రద్దు చేసిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్కు తగినంత నిధులు, సంపాదన అవకాశాలు లేవని ఆర్బీఐ తెలిపింది. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా బ్యాంకు పని చేయడం లేదని ఆరోపించింది. ఆయా సెక్షన్ల నిబంధనలు, విధులను పాటించడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేకపోతున్నదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ బ్యాంకు కొనసాగింపు దాని డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరమని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతించినట్లయితే ప్రజా ప్రయోజనాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. మరోవైపు ఆ బ్యాంకు లిక్విడేషన్ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం కింద డిపాజిట్ సొమ్ములో గరిష్ఠంగా ఐదు లక్షలు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద తీసుకోవడానికి ప్రతి డిపాజిటర్కు అర్హత ఉంటుంది.