న్యూఢిల్లీ, మార్చి 5: పాలనాపరమైన సమస్యల్లేవని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం బంగారం రుణాలను ఇవ్వరాదంటూ ఈ సంస్థకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మంగళవారం సదరు కంపెనీ స్పందించింది. ‘సంస్థలో పాలనాపరమైన సమస్యల్లేవని నిస్సందేహంగా చెప్తున్నాం. ఇవన్నీ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలే. మిక్కిలి ప్రాధాన్యతతో వీటిని పరిష్కరిస్తాం. వెంటనే ఈ సమస్యను తీర్చడానికి గట్టి చర్యలు తీసుకుంటాం. బంగారం రుణాలు మినహా సంస్థ నుంచి అందుతున్న ఇతర సేవలు కొనసాగుతాయి.’ అని అనలిస్టులతో జరిగిన ఓ కాన్ఫరెన్స్ కాల్లో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తెలియజేసింది. ‘ఆర్బీఐ తీసుకునే చర్యలు కాస్త కఠినంగానే ఉండొచ్చు. కానీ మా గోల్డ్ లోన్ కస్టమర్లకు సంబంధించి ఆర్బీఐ నుంచి మేము అందుకున్న ఫిర్యాదులు 135 మాత్రమే. నిజానికి మా వ్యాపార పరిమాణంతో పోల్చితే ఇవి చాలాచాలా తక్కువ’ అని కూడా ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం చెప్పింది. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో పలు పర్యవేక్షణా లోపాలను ఆర్బీఐ గుర్తించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంక్షల నిర్ణయం తీసుకున్నది. తక్షణమే గోల్డ్ లోన్లను ఆపేయాలని ఆదేశించింది.
సంస్థపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు కుప్పకూలాయి. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో ఐఐఎఫ్ఎల్ షేర్ విలువ ఏకంగా 20 శాతం పతనమై రూ.478.5 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజే రూ.119.60 దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లోనూ 19.99 శాతం క్షీణించి రూ.477.75 వద్ద నిలిచింది. సోమవారం ముగింపుతో చూస్తే రూ.119.40 తగ్గినైట్టెంది. ఆర్బీఐ ఆంక్షలతో మదుపరులు భయాందోళనకు గురయ్యారని, అందుకే అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లారని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.